Joshimath Sinking : ఇంకా కుంగిపోతున్న జోషిమఠ్ ! 600 కుటుంబాల్ని తరలిస్తున్న చాపర్లు !
ఉత్తరాఖండ్ లో హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న జోషిమఠ్ ప్రాంతం కుంగిపోతోంది. భూమిలో చోటు చేసుకుంటున్న ఆకస్మిక పరిణామాలతో జోషిమఠ్ కొన్నిరోజులుగా కుంగుతోంది. దీంతో అక్కడి ఇళ్లు బీటలు వారుతున్నాయి. ఇవి మరింత కుంగిపోయి ఇళ్లు కూరుకుపోయే జనం మృత్యువాత పడే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. సీఎం పుష్కర్ థామీ ఇవాళ మరోసారి జోషిమఠ్ లో తీసుకోవాల్సిన చర్యల్ని సమీక్షించారు.
జోషిమఠ్ లో ఇళ్లు కుంగిపోతున్న వ్యవహారం జాతీయస్ధాయిలో కలకలం రేపుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా అక్కడికి భూగర్భ పరిశోధన చేసేందుకు శాస్త్రవేత్తల్ని పంపింది. అలాగే జోషిమఠ్ లో ఎలాంటి పరిస్ధితిని అయినా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రభుత్వం చాపర్లను రెడీ చేసింది. 600 కుటుంబాల్ని అక్కడి నుంచి తరలించాలని సీఎం పుష్కర్ థామీ ఆదేశించారు. మిగిలిన కుటుంబాలను కూడా అక్కడి నుంచి తరలించేందుకు చాపర్లు ఎదురుచూస్తున్నాయి.
జోషిమఠ్ లో నిన్న ఓ పురాతన దేవాలయం కూలిపోయింది. అలాగే పలు ఇళ్లు కూడా బీటలు వారాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం తమను వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో 600 కుటుంబాలను వెంటనే తరలించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేంద్రం పంపిన శాస్త్రవేత్తల బృందం అక్కడ భూగర్బ పరిస్ధితులపై అధ్యయనం ప్రారంభించింది. ఇవాళ ప్రాథమిక నివేదిక కూడా ఇచ్చే అవకాశముంది.