ఈసారి కుంభ మేళ నెల రోజులే... ఏప్రిల్ 1 నుంచి... కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ఉన్నవారికే అనుమతి...
ప్రపంచంలోనే అత్యంత భారీ ఎత్తున భక్తజనం పాల్గొనే కుంభ మేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతీ 12 ఏళ్లకోసారి జరిగే ఈ క్రతువులో హిందువులు భారీ ఎత్తున పాల్గొని పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అయితే ఈసారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో కుంభమేళాను 30 రోజులకే కుదించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకూ కుంభమేళాను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
కుంభమేళాకు సంబంధించి కొద్దిరోజుల క్రితం హరిద్వార్ జిల్లా మెజిస్ట్రేట్ సి.రవిశంకర్ మాట్లాడుతూ...పాసులు ఉన్న భక్తులనే మేళాకు అనుమతిస్తారని చెప్పారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కరోనా నెగటివ్గా తేలినవారికే పాసులు మంజూరు చేస్తారని తెలిపారు. పాసులు లేనివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదన్నారు. భారీ ఎత్తున జనం హాజరవుతారు కాబట్టి... కరోనా వ్యాప్తి వేగంగా జరిగే అవకాశం ఉంటుందని... అందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
కుంభమేళా వద్ద విధులు నిర్వహించబోయే సిబ్బంది కోసం 70వేల కరోనా వ్యాక్సిన్ డోసులను సిద్దం చేయాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి కూడా సూచించినట్లు చెప్పారు. గంగా నది తీరం వెంబడి కెమెరాలను ఏర్పాటు చేసి భక్త జనసందోహాన్ని పర్యవేక్షిస్తామన్నారు.
కాగా,ప్రతీ 12 ఏళ్లకోసారి దేశంలోని నాలుగు నది తీరాల్లో కుంభ మేళ జరుగుతుంది. అలహాబాద్లోని గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమంతో పాటు హరిద్వార్లోని గంగా నది తీరాన,నాసిక్లోని గోదావరి నది తీరాన,ఉజ్జయినిలోని షిప్రా నదీ తీరాన ఈ కుంభ మేళ జరుగుతుంది. సాధారణంగా కుంభమేళా జనవరి రెండో వారంలో ప్రారంభమై ఏప్రిల్ చివరి వారంలో ముగుస్తుంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ సారి కేవలం 30 రోజులకే పరిమితం చేశారు.