జాబ్ కోసం వెళితే లైంగిక వేధింపులు: మంత్రిపై ఫిర్యాదు

తనకు ఉద్యోగం కావాలని వెళ్లిన మహిళపై మంత్రి హరాక్ సింగ్ రావత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని దక్షిణ ఢిల్లీ పోలీసులు తెలిపారు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రీన్ పార్క్లోని తన బంధువుల ఫ్లాట్లో మంత్రి రావత్ ఉన్నారని తెలిసి గత సెప్టెంబర్లో ఉద్యోగం కోసం అతని వద్దకు వెళ్లానని బాధితురాలు తెలిపింది. అక్కడికి వెళ్లిన తనపై మంత్రి రావత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తన శరీర భాగాలను తాకుతూ వేధించాడని బాధితురాలు పేర్కొంది.
తాను తిరస్కరించడంతో ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని తనను బెదిరింపులకు గురిచేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో భయాందోళనకు గురయ్యానని, రావత్ మంత్రి కావడంతో అతనిపై ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేకపోయానని పేర్కొంది.
కాగా, బాధితురాలి ఫిర్యాదుపై మంత్రి రావత్ను ప్రశ్నించగా.. పంచాయతీ, లోక్సభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో తన పేరుప్రతిష్టలకు భంగం కలిగించేందుకే ప్రత్యర్థులు ఇలాంటి కుట్రలు పన్నారని ఆరోపించారు.
అయితే ఆ మహిళ తనను రెండుసార్లు కలిసిందని, ఒకసారి డెహ్రాడూన్ హోటల్లో మీరట్ కాంగ్రెస్ నాయకుడు తారచంద్ శాస్త్రీ సూచించినట్లు కలిసిందని, ఆ తర్వాత ఢిల్లీలోని తన నివాసంలో కలిసిందని తెలిపారు. తొలిసారి తనను కలిసినప్పుడు మైనింగ్ లీజ్ విషయంపై మాట్లాడిందని, అందుకు తాను నిరాకరించడంతో ఆ తర్వాత తనను బ్లాక్ మెయిలింగ్ చేసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications