యూపీలో బీజేపీకి మరో షాక్.. ముఖేష్ వర్మ రాజీనామా.. ఏడుకు చేరిన ఎమ్మెల్యేల సంఖ్య
ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎత్తులు పైఎత్తులతో అధికార, ప్రతిపక్ష పార్టీలు కదన రంగంలోకి దూసుకెళ్తున్నాయి. అయితే మరో నెలరోజుల్లోనే ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీకి ఆపార్టీ నేతలు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. వరుసగా కమలానికి గుడ్ బై చెబుతున్నారు. మూడు రోజుల్లోనే ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యే రాజీనామా చేశారు. దీంతో బీజేపీలో కలవరం మొదలైంది.

బీజేపీకి ఎమ్మెల్యే ముఖేష్ వర్మ గుడ్ బై
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ముఖేష్ వర్మ రాజీనామా చేశారు. దీంతో గత మూడు రోజుల్లోనే బీజేపీని వీడిన ఎమ్మెల్యే సంఖ్య ఏడుకు చేరింది. రాజీనామా చేసిన అనంతరం ముఖేష్ వర్మ ఇప్పటికే బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యను కలిశారు. తమ నాయకుడు ప్రసాద్ మౌర్య అని చెప్పారు. వెనుకబడిన వారికి అయన ఒక గొంతుక అని పేర్కొన్నారు. ఫిరోజాబాద్లోని షికోహాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ముఖష్ వర్మ కొనసాగుతున్నారు.

కమలనాథుల్లో కలవరం
ఉత్తరప్రదేశ్ లో బీజేపీని వీడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కమలనాథుల్లో ఆందోళన నెలకొంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో దళితులు, మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, రైతులు, నిరుద్యోగులు నిర్లక్ష్యానికి గురయ్యారని ఎమ్మెల్యే ముఖేష్ వర్మ ఆరోపించారు. ఈ ఐదేళ్ల బీజేపీ ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాలను, దళితులను, మెనార్టీ వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఎన్నో అవమానాలకు గురైయ్యామన్నారు. అందుకే బీజీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ట్విట్ చేశారు.

ఏస్పీలో చేరేందుకు రంగం సిద్ధం
బీజేపీని వీడిన ముఖేష్ వర్మ ఏ పార్టీలో చేరే దానిపై సమాధానం చెప్పలేదు. కానీ తమ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య అని పేర్కొన్నారు. ఇద్దరు మంత్రులతో సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే స్వామి ప్రసాద్ మౌర్య ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ను కలిసి పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం. కాగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నరేష్ సైనీ, సమాజ్ వాదీ పార్టీ నుంచి హరి ఓం యాదవ్ లు బీజేపీ పార్టీలో చేరారు . అయితే బలమైన బీసీ నేతలు వరుసగా బీజేపీని వీడడంతో కమలనాథుల్లో కలవరం నెలకొంది. మరి ఎన్నికల్లో వీరి ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి..












Click it and Unblock the Notifications