Vaccination రేపే: అలా చేస్తే..ప్రమాదం: గర్భిణులు, పాలిచ్చే తల్లులు టీకా వేసుకోవచ్చా?: పారాసిటమాల్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం మరి కొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఆరంభం కాబోతోంది. శనివారం అన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమౌతుంది. దీనికోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు పూర్తి చేశాయి. ఆయా కేంద్రాలకు వ్యాక్సిన్ల సరఫరా పూర్తయింది. డిజిగ్నేటెడ్ పాయింట్లలో వ్యాక్సిన్లను భద్ర పరిచారు. ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యాక్సినేషన్ సందర్భంగా హెల్త్ వర్కర్లు ఏం చేయాలి? ఏం చేయకూడదో వివరించింది.

రెండు డోసుల్లోనూ ఒకేరకం వ్యాక్సిన్..
రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ రెండు కూడా ఒకే కంపెనీకి చెందినదై ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ లేదా భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ను తొలి డోసుగా తీసుకున్న వారు..రెండో డోసులోనూ అదే వ్యాక్సిన్ను తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రెండు డోసుల్లో.. రెండు వేర్వేరు వ్యాక్సిన్లను తీసుకోవడం అనారోగ్యానికి దారి తీసే అవకాశాలు లేకపోలేదని పేర్కొంది.

గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం..
గర్భిణులు, పాలిచ్చే తల్లులు కరోనా వ్యాక్సిన్ను తీసుకోకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇవ్వరు. గర్భంతో ఉన్నట్లు ఆనవాళ్లు కనిపించినా సరే.. వ్యాక్సిన్ ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రసవానంతరం కూడా వ్యాక్సిన్ తీసుకునే అవకాశం లేదు. బిడ్డకు పాలిచ్చే దశ పూర్తయిన తరువాత.. వ్యాక్సిన్కు సిద్ధం పడాల్సి ఉంటుందని స్పష్టీకరించింది.

18 ఏళ్లకు లోబడి..
18 సంవత్సరాలకు లోబడి వయస్సు ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వబోరు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే. 18 సంవత్సరాలకు పైబడి ఉండటం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. 18 ఏళ్ల లోపు వయస్సున్న వారు వ్యాక్సినేషన్కు దూరంగా ఉండాలని సూచించింది. హెచ్ఐవీ పాజిటివ్ పేషెంట్లను మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం వారు తీసుకుంటోన్న చికిత్సకు, కరోనా వ్యాక్సిన్ మధ్య కొంత గ్యాప్ ఉండాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని డాక్టర్ల సలహాకు అనుగుణంగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుందని సూచించింది.

కరోనా వైరస్ పేషెంట్లకు..
కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లలో కూడా కొందరికి ఇప్పటికిప్పుడు మినహాయింపునిచ్చింది కేంద్రం. కరోనా వైరస్ చికిత్సలో భాగంగా మోనోక్లోనాల్ యాంటీబాడీస్ స్వీకరించిన వారికి లేదా కొన్వాల్సెంట్ ప్లాస్మా చికిత్సను పొందుతున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వరు. నాలుగు నుంచి ఎనిమిది వారాల తరువాతే వారికి వ్యాక్సిన్ ఇస్తారు. ఇతర అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా ఇదే విధానం వర్తిస్తుంది.

పారాసిటమాల్ వినియోగానికి..
కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం..తలనొప్పి, ఫేటిగ్, జ్వరం, ఒళ్లు నొప్పులు, కడుపులో నొప్పి, నిస్సత్తువగా ఉండటం, వాంతులు కావడం, చెమటలు పట్టడం, జలుబు, దగ్గు, నిద్రమత్తు ఆవహించడం వంటి పరిణామాలు సంభవిస్తే.. పారాసిటమాల్ మాత్రల ద్వారా వారికి చికిత్స అందించవచ్చని కేంద్రం సూచించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంతో ముడిపడి ఉన్న అన్ని విభాగలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వొద్దని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications