4 రోజుల్లో టార్గెట్ అసాధ్యం.. జూలైలో మందకొడిగానే వ్యాక్సిన్.. మరీ ఆగస్ట్లో..
కరోనాకు మందు టీకానే.. దేశంలో అందరికీ వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. అయితే జూలై నెలలో టార్గెట్ రీచ్ అయ్యేలా లేదు. నెలలో 13.5 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని అనుకోగా.. ఇప్పటివరకు 9.94 కోట్ల మందికి మాత్రమే ఆదివారం వరకు వ్యాక్సిన్ ఇచ్చారు. అంటే దాదాపు 4 కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉంది. అదీ కూడా 4 రోజుల్లో అందజేయాల్సి ఉంది.
Recommended Video
రోజుకు 60 లక్షల డోసులు
కేంద్రం విధించిన లక్ష్యం సాధించాలంటే రోజుకు 60 లక్షల డోసులను టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ 21వ తేదీన 87 లక్షల మందికి టీకా ఇచ్చి రికార్డ్ సృష్టించారు. జూన్ 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దేశంలో 43.51 కోట్ల మందికి టీకా ఇచ్చారు. గత 24 గంటల్లో 18 లక్షల మందికి పైగా ఇచ్చారు. వీరిలో 34 కోట్ల మంది ఫస్ట్ డోసు తీసుకోగా.. 9.3 కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నారు.
50 కోట్ల లక్ష్యం..
జూలై నెలాఖరు వరకు 50 కోట్ల డోసులతో వ్యాక్సినేషన్ చేయాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం విధించుకుంది. కానీ ఆ టార్గెట్ చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటివరకు 43.51 కోట్ల డోసులను వేయగా, మిగిలిన నాలుగైదు రోజుల్లో లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యం కానుంది. పరిస్థితికి దారితీసిన ప్రధాన కారణాల్లో.. భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ టీకాల ఉత్పత్తి వేగవంతంగా జరగకపోవడం, రష్యాకు చెందిన స్పుత్నిక్-వి టీకాల విడుదల, పంపిణీలో జాప్యం అనేవి ఉన్నాయి.
రానీ టీకాలు
అమెరికా విరాళంగా అందించనున్న మోడెర్నా, ఫైజర్ టీకాల దిగుమతికి న్యాయపరమైన అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఒకవేళ ఆ డోసులు భారత్కు అంది ఉంటే జూలై నెల వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోవడం సులువై ఉండేదని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. కొవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మూడు నెలల్లో టీకా ఉత్పత్తిని రెట్టింపు చేసింది.
మరిన్ని ప్రయోగాలు
దేశంలో వ్యాక్సినేషన్ డోసుల్లో 88 శాతం ఆ టీకావే అనే సంగతి తెలిసిందే. జూన్లో 10 కోట్ల కొవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేసిన 'సీరం' ఆగస్టులో దీన్ని 12 కోట్ల డోసులకు పెంచుతుందనే ఆశాభావంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. బయొలాజికల్-ఈ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా 'కొర్బెవ్యాక్స్'కు సెప్టెంబరు చివరి వరకు అత్యవసర వినియోగ అనుమతి లభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మూడో దశ ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయి. ఆగస్టు 21 నాటికి అత్యవసర అనుమతుల కోసం కంపెనీ దరఖాస్తు చేసుకోనుంది. ఆమోదం లభించిన వెంటనే డిసెంబరు నెలాఖరు వరకు కేంద్ర ప్రభుత్వానికి 30 కోట్ల టీకా డోసులను సరఫరా చేయాలని భావిస్తోంది.