covid vaccine:ప్రైవేట్ ఆస్పత్రులకు వరం-విదేశాల నుంచి దిగుమతికి మోదీ సర్కార్ ఓకే -250కోట్ల డోసులు:కిషన్ రెడ్డి
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం తగ్గుముఖంపట్టి, కొత్త కేసులు తగ్గినా, మరణాలు మాత్రం భారీ సంఖ్యలోనే నమోదవుతుండటం కలవరంగా మారింది. ప్రపంచ టీకాల రాజధానిగా పేరున్న భారత్ లో కొవిడ్ వ్యాక్సిన్ల కొరత నెలకొంది. కేంద్రం అట్టహాసంగా మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగిస్తున్నా, టీకాల కొరత కారణంగా చాలా రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రయను రద్దు చేసుకున్నాయి. పేద, బడుగు, బలహీనులు వెళ్లే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ల పరిస్థితి ఇలా ఉంటే, ప్రైవేటు, కార్పోరేట్ ఆస్పత్రుల్లో మాత్రం ధర చెల్లిస్తే వ్యాక్సిన్లు అందుబాటులో ఉండే పరిస్థితి. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే..
భారత్ డీలా-డ్రాగన్ జోరు: చైనా తయారీ రెండో వ్యాక్సిన్ 'సైనోవాక్'కు WHO అనుమతి -మన ఫార్మాకు దెబ్బ
విదేశాల నుంచి భారీగా..
దేశంలో వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి కేంద్రం శక్తికి మించి పనిచేస్తున్నదని, విదేశాల నుంచి వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లు తెప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నదని, ఇప్పటికే రష్యా నుంచి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల అతిపెద్ద లోడు హైదరాబాద్ కు చేరిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో అమెరికా ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్లను కూడా భారత్ లో వాడకానికి అనుమతించే దిశగా ఆలోచనలు చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విషయాలు చెప్పారు.
ప్రైవేట్ ఆస్పత్రులు.. టీకాల దిగుమతి
భారత్ లో నెలకొన్న కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా దేశంలోని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు చట్టప్రకారం కొన్ని సడలింపులు కల్పించామని, సదరు సడలింపుల ద్వారా ఆయా ఆస్పత్రులు విదేశాల నుంచి వారికి ఇష్టమైన వ్యాక్సిన్లను నేరుగా దిగుమతి చేసుకునే వీలుంటుందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాగా, స్వాతంత్ర్యం తరువాత దేశంలో ఎలాంటి ఆరోగ్య విపత్తు తలెత్తినా, కేంద్ర ప్రభుత్వమే టీకాల పంపిణీనిని చేపడుతూరాగా, ప్రస్తుత మోదీ సర్కారు మాత్రం సదరు ప్రక్రియను కమర్షియల్ గా మార్చేసి, రాష్ట్రాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు టీకాల విక్రయం అనే కాన్సెప్టును తీసుకురావడాన్ని సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టింది. జాతీయ టీకా విధానంలో లోపాలపై కోర్టు మొట్టికాయలు వేసినా, కేంద్రం మాత్రం ప్రైవేటు చేతికి టీకాల అందజేత ప్రక్రియను వేగవంతం చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే..
డిసెంబర్ నాటికి 250డోసులు.. అందరికీ వ్యాక్సిన్
దేశంలో వ్యాక్సిన్ల కొరత, వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతోండటంపై మీడియా ప్రశ్నలకు మంత్రి కిషన్ రెడ్డి దీటుగా బదులిచ్చారు. ''వ్యాక్సినేషన్ నిదానంగా సాగుతోందనేది అవాస్తవం. ఎందుకంటే వేగంగా టీకాలను అందిస్తోన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్లు అందేలా చూస్తాం. అర్హులైన ఏ ఒక్కరూ మిస్ కాకుండా చూసుకుంటాం. వీలైన అన్ని మార్గాల ద్వారా టీకాల సేకరణకు మోదీ సర్కార్ నడుంకట్టింది. డిసెంబర్ నాటికి 250 కోట్ల డోసుల టీకాలను భారత్ సేకరించేలా ప్రణాళికలు రూపొందించాం. ఎవర్నీ వదలకుండా అందరికీ టీకాలిస్తాం'' అని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు.