రాందేవ్ శిష్యుడి మరో వివాదం, బీజేపీకి శివసేన ఝలక్
న్యూఢిల్లీ: 26/11 దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్తో భేటీ అయిన యోగా గురువు రాం దేవ్ బాబా అనుచరుడు వేద ప్రతాప్ వైదిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ స్వతంత్రంగా ఉండాలని అక్కడి ప్రజలు చాలామంది కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాశ్మీర్ ప్రాంతానికి మరిన్ని అధికారాలు ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ పాత జర్నలిస్టు ద్వారా తాను హఫీజ్ను కలిశానని చెప్పారు. తనకు బీజేపీ నేతల కంటే కాంగ్రెస్ నేతలే ఎక్కువగా తెలుసునని చెప్పారు.
పార్లమెంటులో రగడ
పార్లమెంటు ఉభయ సభలలో వేద ప్రతాప్ వైదిక్, హఫీజ్ సయిద్ల భేటీ అంశం రగడకు దారి తీసింది. ఈ భేటీ పైన కాంగ్రెసు పార్టీ అధికార పార్టీ పైన మండిపడింది. ఈ భేటీలో ప్రభుత్వం ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది.
ఇలాంటి ఘటనలు దేశభద్రతకు ప్రమాదకరమని మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సభ్యుడు గులాం నబీ అజాద్ అన్నారు. ఎంబసీ ప్రమేయం లేకుండా భేటీ జరిగిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతో బీఎస్పీ, ఎస్పీ, వామపక్షాలు, జేడీయులు జత కలిశాయి. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి దీనిపై చర్చించాలని డిమాండ్ చేశారు.
భేటీ పైన తమకు ఎలాంటి సమాచారం లేదని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ప్రభుత్వం సహాయపడలేదని మరో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. వైదిక్ పర్యటన వ్యక్తిగతమని ఆమె తెలిపారు. కాగా, అధికార పార్టీకి మిత్రపక్షం శివసేన కూడా ఝలక్ ఇచ్చింది. ఈ భేటీ అంశంపై చర్చకు శివసేన డిమాండ్ చేసింది.