'యడ్యూరప్ప ఒక్కరోజు ముఖ్యమంత్రి, సగం రోజు పూర్తయింది, అమిత్ షా ఫార్ములా అదే కదా'
హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప ఒక్కరోజు ముఖ్యమంత్రేనని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా గురువారం అన్నారు. అందులోను ఆయన ప్రమాణం స్వీకారం చేసి సగం రోజు పూర్తయిందని, ఇక మిగిలింది సగం రోజేనని చెప్పారు. ఆయన ఒక్కరోజు సీఎంగానే ఉంటారన్నారు.
గవర్నర్ వాజుభాయ్ వాలా గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం త్యాగం చేశారని, నిన్న (బుధవారం బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం ద్వారా) రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నరేంద్ర మోడీకి త్యాగం చేశారని ఎద్దేవా చేశారు. బీజేపీని ఆహ్వానించడం ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నారు.
రణ్దీప్ సుర్జేవాలా ఆగ్రహం
బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం ద్వారా గవర్నర్ మొదటిసారి రాజ్యాంగాన్ని ఎన్కౌంటర్ చేశారని, ఈ రోజు (గురువారం) యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా రెండోసారి ఎన్కౌంటర్ చేశారని రణ్దీప్ సుర్జేవాలా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఆంగ్లో -ఇండియన్ ఎమ్మెల్యే
ఆంగ్లో - ఇండియన్ ఎమ్మెల్యేను గవర్నర్ అసెంబ్లీకి నామినేట్ చేయడంపై కాంగ్రెస్ - జేడీఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కోర్టు వారి పిటిషన్ను మెయిన్ పిటిషన్తో పాటు శుక్రవారం విచారించనుంది. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం, ఆయనకు ఉన్న బలం ఎంత అనే అంశాలపై సుప్రీం కోర్టు రేపు విచారణ జరపనుంది.
దేశవ్యాప్తంగా ఆందోళనలు
కర్ణాటకలో రాజకీయ పరిణామాలు, ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఏఐసీసీ గురువారం అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులకు లేఖ పంపించింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు, నేతలు, కార్యకర్తలు రాజధాని, జిల్లా కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించాలని పేర్కొంది.
బీహార్కు పాకిన కర్ణాటక ప్రభావం
కర్ణాటక ఎఫెక్ట్ గోవా తర్వాత బీహార్కు కూడా పాకింది. తాము శుక్రవారం మధ్యాహ్నం గవర్నర్ను కలుస్తామని, బీహార్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన ఆర్జేడీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతామని ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ అన్నారు.
మెజార్టీ ఎలా నిరూపించుకుంటారు, షా ఫార్ములా హార్స్ ట్రేడింగ్
కర్ణాటకలో బీజేపీ మెజార్టీ ఎలా నిరూపించుకుంటుందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. అమిత్ షాకు తెలిసిన ఫార్ములా ఒక్కటేనని, అది హార్స్ ట్రేడింగ్ అన్నారు. లేదంటే సీబీఐ, ఈడీలను చూపించి బెదిరించడం అన్నారు. బీజేపీ నియంతలా వ్యవహరిస్తోందన్నారు. ఈ రోజు మనం ఒక్కటి కాకుంటే నిన్న బీహార్, నేడు కర్ణాటక రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పునరావృతం అవుతుందన్నారు.
బెంగళూరు రిసార్టులో ఎమ్మెల్యేలు
బెంగళూరు సమీపంలోని ఈగల్టన్ రిసార్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రిసార్టు బయట గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.