180కి.మీ వేగం: భారత టాప్ మహిళా బైక్ రేసర్ వీను మృతి
భోపాల్: దేశంలోనే టాప్ మహిళా బైక్ రేసర్గా గుర్తింపు తెచ్చుకున్న వీను పాలివల్(44) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మధ్యప్రదేశ్లోని విదీషా జిల్లాలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.
వీను తన తోటి బైక్ రేసర్ దీపేశ్ తన్వర్తో కలిసి హార్లే డేవిడ్సన్ బైక్పై టూర్కి వెళ్లారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కి 100 కి.మీలు దూరంలో ఉన్న గ్యారాస్పూర్ ప్రాంతంలో బైక్ అదుపుతప్పి బోల్తాపడి వీను తీవ్రంగా గాయపడ్డారు. దీపేశ్ ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, రాజస్థాన్లోని జైపూర్ కు చెందిన పాలివల్ కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. హార్లే డేవిడ్సన్ బైక్లపై గంటకు 180 కిమీల ప్రయాణం చేయడం వీను ప్రత్యేకత. దేశ వ్యాప్తంగా తన బైక్ జర్నీపై ఆమె డాక్యుమెంటరీ తీయాలని నిర్ణయించుకుంది.
అందులో భాగంగానే మధ్యప్రదేశ్లోని విదిశ జిల్లాలోకి ప్రవేశించి సాగర్ అనే ప్రాంతం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే వేగంలో ఉన్న తన బైక్ పై నియంత్రణ కోల్పోవడంతో అది బలంగా రోడ్డును తాకి పల్టీలు కొట్టింది.
దీంతో పాలివల్ కు బలంగా గాయాలు కాగా.. విదిశలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఇటీవల వీను పాలివల్ను లేడీ ఆఫ్ ది హర్లీ 2016గా కూడా ప్రకటించారు.