మాకు సంబంధం లేదు: తెలుగు రాష్ట్రాల ఎన్కౌంటర్లపై వెంకయ్య
హైదరాబాద్: శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోదని, తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్కౌంటర్లపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలోని ఆలేరులో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లపై ఆయన శనివారం మీడియా సమావేశంలో స్పందించారు.
సిమీ కార్యకర్తలను, ఎర్రచందనం దొంగలను చంపితే మానవ హక్కులు గుర్తుకు వస్తాయా, విధి నిర్వహణలో అధికారులు చనిపోతే మానవ హక్కులు గుర్తుకు రావా అని ఆయన అడిగారు. పోలీసులు మనుషులు కారా అని ఆయన ప్రశ్నించారు. మానవ హక్కుల సంఘాలు ద్వంద్వ ప్రమాణాలను పాటించడం సరి కాదని ఆయన అన్నారు.

ఉగ్రవాదులు పోలీసులను చంపినప్పుడు మజ్లీస్ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన అడిగారు. నేతాజీ కుటుంబంపై నిఘా విషయంలో కాంగ్రెసు ఎందుకు ఉలిక్కి పడుతోందని ఆయన ప్రశ్నించారు. స్థిరాస్తి రంగానికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతామని ఆయన చెప్పారు.
ముంబై దాడుల సూత్రధారి లఖ్వీ విడుదలను తమ ప్రభుత్వం వ్యతిరేకించిందని, అయినా లక్వీని విడుదల చేయడం దురదృష్టకరమని వెంకయ్య నాయుడు అన్నారు. లక్వీ విడుదలపై భారత్ నిరసనను పాకిస్తాన్కు తెలియజేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications