venkaiah naidu: ఫోన్ చేసి వివరాలడిగిన వెంకయ్యనాయుడు
తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర ఇన్ ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిపై దుండగుడు కారుతో దాడిచేసిన సంగతి తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోటంరెడ్డికి మాజీ ఉప రాష్ట్రపతి వెం.వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. అందుతున్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన తీరును, కోటంరెడ్డికి అందుతున్న వైద్యాన్ని అడిగారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని, త్వరలోనే ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని సూచించారు.
తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని నాగవెంకట రాజశేఖర్రెడ్డి అనే యువకుడు కారుతో ఢీ కొట్టి పరారయ్యాడు. ఈ ఘటనలో కోటంరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ముందుగా ఇంట్లోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి కోటంరెడ్డి కుమారుడితో వివాదానికి దిగారు. కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, అతడిని హెచ్చరించి బయటకు పంపేశారు. అనంతరం శ్రీనివాసులరెడ్డి ఇంటిబయట నిలబడి ఉండగా రాజశేఖర్ రెడ్డి కారుతో వచ్చి ఢీకొట్టి పారిపోయాడు.
తీవ్ర గాయాలైన కోటంరెడ్డిని అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. నిందితుడి కారు వెనక మరో కారు కూడా ఉందని, ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగిన దాడి అని శ్రీనివాసులరెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కోటంరెడ్డి కుమారుడికి, రాజశేఖర్రెడ్డికి మధ్య గొడవకు సంబంధించిన కారణాలు తెలియరాలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటం రెడ్డిని చంద్రబాబు, నారా లోకేష్ తోపాటు పార్టీ నేతలు పలువురు పరామర్శించారు. తాజాగా వెంకయ్యనాయుడు ఫోన్ లో పరామర్శించారు.