వక్తృత్వ పోటీ కాదు: కిరణ్ టీ వాదనపై వెంకయ్య
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ సమస్యపై శానససభలో చేసిన ప్రసంగంపై బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. శాసనసభలో కిరణ్ కుమార్ రెడ్డి చాలా గణాంకాలు చెప్పారని, తెలంగాణపై చరిత్రను తవ్విపోసుకోవాల్సిన అవసరం లేదని, గంభీరమైన తెలంగాణ సమస్యపై కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చ వక్తృత్వ పోటీ కాదని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్యపై పార్టీ అధిష్టానంతో కిరణ్ కుమార్ రెడ్డి తన ఆవేదనను ముందే వెల్లడించారా, లేదా అనేది, చెప్పినా అధిష్టానం వినలేదా అనే విషయం తేలాలని ఆయన అన్నారు. ఈ విషయంపై కాంగ్రెసు అధిష్టానం పెద్దలు, దిగ్విజయ్ సింగ్, కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి, అధిష్టానం కూడబలుక్కునే అక్కడో మాట ఇక్కడో మాట మాట్లాడుతున్నారా చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభ్యుడిగా తన అభిప్రాయాలను కిరణ్ కుమార్ రెడ్డి చెప్పవచ్చునని, అయితే ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన వచ్చినప్పుడు గంభీరంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బిల్లును వ్యతిరేకిస్తున్నానని చెప్పడంపై స్పందిస్తూ ఆ వైఖరి కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తిగతమా, పార్టీదా చెప్పాలని ఆయన అన్నారు.
తెలంగాణ అంశం చివరి అంకంలో కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయాలు ఎందుకు చెబుతున్నారని ఆయన అడిగారు. అధిష్టానం ఓ రకంగా, ముఖ్యమంత్రి ఓ రకంగా, పిసిసి అధ్యక్షుడు మరో రకంగా ఎందుకు మాట్లాడుతున్నారని, పార్టీలో చర్చించారా అని తాను పార్లమెంటులో అడిగితే పార్టీలో కూడా విస్తృతంగా చర్చించామని, పార్టీ వెలుపలా బయటా ఇంత విస్తృత స్థాయిలో చర్చ జరిపిన అంశం ఇప్పటి వరకు తాను చూడలేదని చిదంబరం చెప్పారని ఆయన గుర్తు చేశారు. చిదంబరం చెప్పింది నిజమా, ముఖ్యమంత్రి చెప్పేది నిజమా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పేది నిజమా తేలాలని ఆయన అన్నారు.
తెలంగాణ అంశం కొలిక్కి వచ్చిన తర్వాత సీమాంధ్రలో రెండు ర్యాలీలు, తెలంగాణలో ఓ ర్యాలీ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. 29న విజయవాడ మోడీ ఫర్ పిఎం యాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మోడీ నాయత్వాన్ని అంగీకరించి తమ పార్టీలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని, వారిని పార్టీలో చేర్చుకుంటామని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభంజనం పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రారంభమైందని, ఇతర రాష్ట్రాల్లో క్రమంగా ప్రారంభమవుతోందని ఆయన అన్నారు.
ఫిబ్రవరిలో చెన్నై, భువనేశ్వర్, కోల్కతాల్లో ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో కూడా ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. చాలా మంది యువకులు తమ రాజకీయ జీవితాన్ని బిజెపితో ప్రారంభించాలని అనుకుంటున్నారని ఆయన చెప్పారు. పార్టీలో చేరాలని అనుకుంటున్న సాధారణ నాయకులను, మోడీ కోసం ప్రచారం చేయాలనుకునేవారిని విజయవాడలో కలుస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications