విజయ్ మాల్యా ఆర్థిక ఉగ్రవాది: శివసేన
ముంబై: కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా విషయంలో శివసేన మండిపడింది. విజయ్ మాల్యా భారత ఆర్థిక ఉగ్రవాది అని అభివర్ణించింది. అలాంటి వ్యక్తికి తగిన శిక్షపడాలని, అందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శివసేన అభిప్రాయం వ్యక్తం చేసింది.
శుక్రవారం తన అధికార పత్రిక సామ్నా లో శివసేన ఈ విధంగా విజయ్ మాల్యా మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్ మాల్యాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కేంద్ర ప్రభుత్వం పెద్ద రక్షణ కవచంగా ఉందని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ మీద శివసేన నిప్పులు చెరిగింది.
యూపీఏ ప్రభుత్వంలో విజయ్ మాల్యాకు లెక్కలేనన్ని లోన్లు ఇచ్చారని ఆరోపించింది. ఇప్పుడు ఆ రుణాలు ఎగ్గొట్టి పారిపోయేందుకు ఎన్డీఏ ప్రభతుత్వం సహకరిస్తూ అవకాశం కల్పిస్తున్నదని విమర్శించారు. రూ. వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విజయ్ మాల్యా మీద కేసులు నమోదు చేశారని అన్నారు.
ఈడీ విచారణ ఎదుర్కోంటున్న విజయ్ మాల్యాకు కేంద్ర ప్రభుత్వం రక్షణగా నిలిచిందని శివసేన ఆరోపించింది. విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్లు తప్పించుకుంటే దేశంలో ఇలాంటి వ్యక్తులు పుట్టుకుని వస్తూనే ఉంటారని శివసేన చెప్పింది. వెంటనే విజయ్ మాల్యాను విదేశాల నుంచి భారత్ కు రప్పించి విచారణ చెయ్యాలని శివసేన డిమాండ్ చేసింది.