బ్యాంకులతో వన్ టైం సెటిల్మెంట్కు సిద్ధంగా ఉన్నా: విజయ్ మాల్యా
బ్యాంకులతో వన్ టైం సెటిల్ మెంట్ కు తాను సిద్ధంగా ఉన్నట్లు విజయ్ మాల్యా శుక్రవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఎట్టకేలకు దిగి వస్తున్నట్లే కనిపిస్తోంది. మాల్యాను విదేశాల నుంచి వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టు కూడా మాల్యా విషయంలో సీరియస్ కామెంట్స్ చేసింది.
ఈ నేపథ్యంలో తాను బ్యాంకులతో వన్ టైం సెటిల్ మెంట్ కు సిద్ధంగా ఉన్నట్లు విజయ్ మాల్యా శుక్రవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మేరకు బ్యాంకులతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

పరిష్కారానికి సిద్ధంగా ఉన్నా...
గౌరవనీయమైన సుప్రీంకోర్టులో తమ ఆఫర్ ను పరిగణనలోనికి తీసుకోకుండా బ్యాంకులు తిరస్కరించాయని ఆయన ఆరోపించారు. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి, న్యాయబద్ధంగా సెటిల్ చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

అవకాశం నాకెందుకివ్వడం లేదు?
పబ్లిక్ రంగ బ్యాంకులు వన్ టైం సెటిల్ మెంట్ విధానాన్ని పాటిస్తూ ఉంటాయని, ఇలా ఎన్నో వందల మంది రుణగ్రహీతలు తమ లోన్లను సెటిల్ చేసుకున్నారని, మరి తనకు మాత్రం బ్యాంకులు ఈ అవకాశం ఇవ్వడం లేదని మాల్యా ప్రశ్నించారు.

ప్రభుత్వమే నాకు వ్యతిరేకం...
అంతేకాదు, ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ఉన్నదనడానికి సుప్రీం కోర్టులో అటార్నీ జనరల్ చేసిన ఆరోపణలే సాక్ష్యమని, నిజానికి ఎలాంటి విచారణ జరగకుండానే ప్రభుత్వం తనపై ఆరోపణలు గుప్పించిందని, తాను మాత్రం ప్రతీ కోర్టు ఆర్డర్ ను ఎలాంటి మినహాయింపు లేకుండా అంగీకరించానంటూ మాల్యా పాత పల్లవే మళ్లీ అందుకున్నారు.

రెండు కేసుల్లో తీర్పు రిజర్వ్...
ఉద్దేశపూర్వక రుణ ఎగవేత, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని, అలాగే డియోజియో సంస్థ నుంచి పొందిన 40 మిలియన్ డాలర్లను డిపాజిట్ చేసేలా ఆయనపై చర్యలు తీసుకోవాలని దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై తీర్పును అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది.

మాల్యా న్యాయవాదిపై ప్రశ్నల వర్షం...
గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా మాల్యా తరఫు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. వడ్డీ సహా దాదాపు రూ.9 వేల కోట్ల రుణాల బకాయిల కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియం ఈ పిటిషన్లను దాఖలు చేసింది. మాల్యా ఆస్తుల గురించి సరైన వివరాలనే అందించారా? అంటూ అటు వైద్యనాథన్ ప్రశ్నించిన ద్విసభ్య ధర్మాసనం ఇటు బ్యాంకులకు కూడా కీలక ప్రశ్నలను సంధించింది.












Click it and Unblock the Notifications