సినిమా: నాడు హెలికాప్టర్, నేడు ఎద్దుల బండిలో నామినేషన్, చిల్లర సంచి, స్టూడెంట్ లీడర్!
బెంగళూరు: ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్థిస్తుంటారు. కర్ణాటకలోని శివమొగ్గలో ఓ స్టూడెంట్ లీడర్ ఎద్దుల బండిలో చిల్లర నాణెలు తీసుకువెళ్లి నామినేషన్ వేసి ఎన్నికల అధికారులకు పట్టపగలు సినిమా చూపించాడు. గతంలో ఇతను హెలికాప్టర్ లో వెళ్లి నామినేషన్ వేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
దేశాన్ని ఉద్దరిస్తున్నారా ? యుద్ధం చేశారా ? సిద్దూ ఫైర్ !
శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గంలో ఓ విద్యార్థి సంఘం నాయకుడు వినయ్ రాజావత్ (26) ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఎద్దుల బండిలో సాటి విద్యార్థులతో కలిసి వినయ్ రాజావత్ జిల్లా కార్యాలయం దగ్గరకు చేరుకున్నాడు. ఎద్దుల బండిలో ఓ సంచి కూడా అతను తీసుకెళ్లాడు.
శివమొగ్గ జిల్లా కార్యాలయంలోకి వెలుతున్న వినయ్ రాజావత్ ను భద్రతా సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. వినయ్ రాజావత్ దగ్గర ఉన్న సంచిని భద్రతా సిబ్బంది చూసి షాక్ కు గురైనారు. సంచిలో రూ. 1, రూ. 2 నాణెలు చూసిన భద్రతా సిబ్బంది ఏమిటిది అని వినయ్ రాజావత్ ను ప్రశ్నించారు.
తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, నామినేషన్ వేసే సమయంలో డిపాజిట్ చెయ్యడానికి రూ. 12, 500 నాణెలు తీసుకొచ్చానని వినయ్ రాజావత్ భద్రతా సిబ్బందికి చెప్పాడు. సంచిని క్షుణ్ణంగా పరిశీలించిన భద్రతా సిబ్బంది వినయ్ రాజావత్ ను కార్యాలయం లోపలికి అనుమతించారు.
ఎన్నికల అధికారుల టేబుల్ మీద చిల్లర నాణెలు సంచి పెట్టిన వినయ్ రాజావత్ నామినేషన్ పత్రాలు అందించాడు. నాణెలు లెక్కించడానికి సమయం లేకపోవడంతో సంచిని పక్కన పెట్టిన అధికారులు వినయ్ రాజావత్ దగ్గర నామినేషన్ పత్రాలు తీసుకుని అతన్ని అక్కడి నుంచి పంపించారు.
హెలికాప్టర్ దెబ్బ:
2018 కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా శికారిపుర శాసన సభ నియోజక వర్గం నుంచి వినయ్ రాజావత్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మీద స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆ సమయంలో బెంగళూరు నుంచి శికారిపురకు హెలికాప్టర్ లో వచ్చిన వినయ్ రాజావత్ నామినేషన్ వేసి అందర్ని ఆకర్షించాడు. శాసన సభ ఎన్నికల్లో 459 ఓట్లు సంపాదించిన వినయ్ రాజావత్ డిపాజిట్ కొల్పోయాడు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప కుమారుడు బీఎస్. రాఘవేంద్ర మీద వినయ్ రాజావత్ పోటీ చేస్తున్నాడు.