లొంగిపోయేందుకు రోడ్డుమార్గంలో: జయ సమాధివద్ద భూమిని కొట్టి శశికళ శపథం
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ బుధవారం నాడు బెంగళూరు బయలుదేరారు. ఆమె పోయెస్ గార్డెన్ నుంచి రోడ్డు మార్గంలో కర్నాటక రాజధానికి బయలుదేరారు.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ బుధవారం నాడు బెంగళూరు బయలుదేరారు. ఆమె పోయెస్ గార్డెన్ నుంచి రోడ్డు మార్గంలో కర్నాటక రాజధానికి బయలుదేరారు.
సమాధి వద్ద శపథం చేసిన చిన్నమ్మ
బెంగళూరు కోర్టుకు వెళ్లేముందు జయ సమాధిని సందర్శించిన శశికళ అక్కడ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె జయ సమాధి వద్ద చేతితో భూమి పైన మూడుసార్లు కొట్టి శపథం చేశారు. అనంతరం బెంగళూరు కోర్టుకు బయలుదేరారు. సమాధి వద్ద జయ రుద్రరూపం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
శశికళ శపథం
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో లొంగిపోయేందుకు పోయెస్ గార్డెన్ నుంచి బయలుదేరిన శశికళ జయ సమాధి వద్దకు చేరుకున్నారు. అక్కడ తొలుత పూలు చల్లి నివాళులు అర్పించారు.
నివాళులు
శశికళ వెంట పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. శశికళతో పాటు నేతలు జయ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం అమ్మ సమాధికి నమస్కరించారు.
రుద్రరూపం
అమ్మ సమాధి వద్ద శశికళ రుద్రరూపం కనిపించింది. ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సమయంలోనే మూడుసార్లు భూమిని కొట్టి శపథం చేశారు. ఆ సమయంలో ఆమె ఓసారి తుళ్లి కిందపడబోయారు. మళ్లీ తమాయించుకున్నారు.
జయ సమాధి వద్ద వంగి..
జయలలిత సమాధి వద్ద శశికళ రౌద్రరూపం, ఆమె చేసిన శపథం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పన్నీరు సెల్వం తిరుగుబాటు వెనుక బీజేపీ, డీఎంకే పార్టీలు ఉన్నాయని శశికళ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె శపథం ఆసక్తికరంగా మారింది.
అన్నాడీఎంకేను కాపాడుతానని చెబుతూ ఆమె శపథం చేసినట్లుగా భావిస్తున్నారు. గతంలో శశికళ వింతగా ప్రవర్తించలేదు.ఆమె ప్రవర్తన చూసి పక్కన ఉన్న వాళ్లు నినాదాలు చేశారు. ఆమె తన కోపాన్ని పన్నీరు, స్టాలిన్, బీజేపీల పైనే వెళ్లగక్కారని భావిస్తున్నారు.
జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ, దినకరన్, ఇళవరసిలకు సుప్రీం కోర్టు మంగళవారం నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే తనకు కోర్టులో లొంగిపోయేందుకు నాలుగు వారాల సమయం కావాలని శశికళ కోరింది. సుప్రీం కోర్టు గడువు ఇచ్చేందుకు నిరాకరించింది.
ఈ నేపథ్యంలో బుధవారం ఆమె బెంగళూరుకు బయలుదేరారు. రోడ్డు మార్గంలో ఆమె బయలుదేరారు.
ఎంట్రీ: శశికళకు చెక్, పన్నీరు వర్గంలో చేరిన దీపా: అద్భుతం జరిగితేనే..
కాగా, అక్రమాస్తుల కేసులో శశికళ, ఆమె ఇద్దరు బంధువులకు ఒక్కొక్కరికి నాలుగేళ్ల కారాగార శిక్ష, రూ.10 కోట్లు చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు 2014లో తీర్పునిచ్చింది. అప్పట్లో జయలలితకు నాలుగేళ్ల జైలు, రూ.100 కోట్ల జరిమానా విధించింది.
తర్వాత కర్ణాటక హైకోర్టు దానిని నిలుపు చేయగా విషయం సుప్రీం కోర్టుకు వచ్చింది. సుప్రీం కోర్టు గత జూన్ 7న తీర్పును వాయిదా వేసింది. 1991-96 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా జయ ఉన్నప్పుడు ఆమె, మరో ముగ్గురు కలిసి ఆదాయానికి మించి రూ.66.65 కోట్లు ఆర్జించారనేది అభియోగం.
ప్రధాన తీర్పును జస్టిస్ ఘోష్ రాశారు. 34 డొల్ల కంపెనీల ద్వారా అపార సంపద ఆర్జించడానికి, న్యాయ ప్రక్రియను మోసగించడానికి బలమైన కుట్రను పన్నిన తీరును కేసు చెబుతోందని జస్టిస్ రాయ్ వ్యాఖ్యానించారు. శశికళ విడుదలయ్యాక ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు.
అమ్మ భారాన్ని ఆమె మోస్తారు: అన్నాడీఎంకే
తీర్పు వెలువడిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ శశికళకు బాసటగా నిలిచింది. జయలలిత భారాన్ని ఆమె ఎప్పుడూ తనపై వేసుకునేవారనీ, ఇప్పుడూ అదే చేస్తున్నారనీ పార్టీ ట్విటర్ ఖాతా ద్వారా పేర్కొంది.