క్లాస్ రూమ్స్ లాడ్జిలుగా మార్చేశారు.. పరీక్షలు ఎక్కడ రాయిస్తున్నారో తెలుసా?
భోపాల్: ఓవైపు క్రీడాకారుల అల్లరి.. మరోవైపు డ్యాన్స్ హంగామా.. ఈ రెండింటి నడుమ విద్యార్థుల పరీక్ష. మధ్యప్రదేశ్ లోని తికంగఢ్ జిల్లా సీనియర్ సెకెండరీ స్కూల్లో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. వాలీబాల్ ప్లేయర్స్ కోసం క్లాస్ రూమ్స్ను లాడ్జిలుగా(వసతి కేంద్రాలు) మార్చేసి.. విద్యార్థులను ఏకంగా టెర్రస్పై కూర్చొబెట్టి పరీక్షలు రాయించారు. మరోవైపు జిల్లా విద్యా అధికారి మాత్రం ఈ విషయం దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం.

సునీల్ నాయక్ మెమోరియల్..:
దివంగత బీజేపీ నేత సునీల్ నాయక్ స్మారకార్థం ప్రతీ ఏడాది ఇక్కడి పాఠశాలలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా సునీల్ నాయక్ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ అండ్ ఎమ్మెల్యే కప్ ఈనెల 6న ఇక్కడ ప్రారంభమైంది.

సమస్యేంటి:
ఈ టోర్నమెంట్ పెట్టిన ప్రతీసారి పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోర్నమెంట్ కోసం వచ్చే క్రీడాకారులకు పాఠశాల తరగతి గదులను వసతి కేంద్రాలుగా మారుస్తున్నారు. దీంతో విద్యార్థుల చదువు, పరీక్షలు అన్నీ టెర్రస్ పైనే సాగుతున్నాయి.

పరీక్షలు టెర్రస్ పైనే :
ఈ సమస్య పట్ల ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా.. వారి నుంచి పెద్దగా స్పందన రావట్లేదని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 26వ తేదీ వరకు పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే 6వ తేదీ నుంచి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించడంతో.. పరీక్షలు కాస్త టెర్రస్ పైనే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి.

దృష్టి పెట్టలేకపోతున్న విద్యార్థులు:
ఓవైపు వాలీబాల్ టోర్నీ జరుగుతుండగానే.. డాన్స్&మ్యూజిక్ ఫెస్టివల్ కూడా నిర్వహించడంతో విద్యార్థులు పరీక్షలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. దీనిపై స్పందించిన జిల్లా ద్యాధికారి బీఎల్ లహూరియా.. టోర్నీ విషయం తమ దృష్టికి రాలేదన్నారు. పరీక్షలు నిర్వహిస్తున్న తేదీల్లోనే టోర్నమెంట్కు ఎలా అనుమతించారనే దానిపై విచారణ జరుపుతామన్నారు.












Click it and Unblock the Notifications