మోడీకి ఓటేయాలన్న అద్వానీ, నాటి భేటీయే కారణమా?
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి ఓటేయాలని దేశ ప్రజలను కోరారు. మార్పు కోసం మోడీకి ఓటేయాలని అద్వానీ కోరారు. పార్లమెంటరీ సీటు విషయమై వివాదం చెలరేగడంతో మోడీతో కొద్దిరోజుల పాటు అంటీముట్టనట్టుగా వ్యవహరించిన అద్వానీ సోమవారం మహారాష్ట్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దేశానికి కావాల్సింది నినాదాలు కాదని.. చర్యలు అన్నారు.
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి హయాంలో ప్రారంభమైన దేశ అభివృద్ధి ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలని మోడీ కృతనిశ్చయంతో ఉన్నారని, కనుక మార్పును కాంక్షించే వారంతా మోడీకి ఓటు వేయాలని అద్వానీ పిలుపునిచ్చారు. బిజెపి సిట్టింగ్ ఎంపీ దినేష్ గాంధీకి మద్దతుగా శివ్గావ్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అద్వానీ ప్రజలకు ఈ విజ్ఞప్తి చేశారు.

దేశం కోరుకుంటున్నది నినాదాలను కాదని, మార్పును, అందుకు తగిన కార్యాచరణను ప్రజలు కోరుకుంటున్నారని, కనుక మార్పును కోరుకునే వారంతా మోడీకి ఓటు వేయాలని ఆయన అన్నారు. నర్మదా ప్రాజెక్టు, పారిశ్రామికీకరణ ద్వారా గుజరాత్ స్వరూపాన్నే మార్చివేసిన మోడీ, రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరచడమే కాకుండా ప్రతి రైతుకు సాగునీరు అందిస్తున్నారని, విద్య, ప్రజా పంపిణీ రంగాలతో పాటు శాంతి భద్రతలను మెరుగుపరచి ప్రజలందరికీ మౌలిక వసతులు కల్పించారని ప్రశంసించారు.
అంతలోనే ఎంత మార్పు
మోడీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆడ్వానీ పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నాటి నుంచి మోడీతో ఆయనకు సుహృద్భావ సంబంధాలు లేవు. ఇటీవల ఆడ్వానీ పోటీ చేసే స్థానం విషయంలో నెలకొన్న వివాదంతో ఆ దూరం మరింత పెరిగిందని అంతా భావించారు.
మోడీతో సరైన సంబంధాలు లేని కారణంగానే 1991 నుంచి పోటీ చేస్తున్న గాంధీనగర్ లోకసభ స్థానం నుంచి కాక భోపాల్ నుంచి పోటీ చేయాలని ఆడ్వానీ తొలుత భావించారు. అయితే, ఇక్కడే మోడీ తన రాజకీయచాతుర్యాన్ని ప్రదర్శించారు. ఓ అడుగు వెనక్కి తగ్గారు. నేరుగా ఆడ్వానీ నివాసానికి వెళ్లి ఆయనను పెద్దాయనను మెప్పించారు. తాజాగా ఆడ్వానీ స్వరం మారడానికి నాటి భేటీయే కారణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.












Click it and Unblock the Notifications