75 శాతం కావాలి.. వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య
ఎంత డెవలప్ అవుతున్నా.. ఓటింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మావోయిస్టు, బందిపోటు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో అయితే ఏదో అనుకోవచ్చు.. కానీ సిటీలో కూడా కొందరు ఓటు వేయడానికి ఆసక్తి చూపించడం లేదు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోక పోవడం ఆందోళన కలిగిస్తోంది.
75 శాతం పక్కా..
వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని 75 శాతానికి పెంచాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓటింగ్ జరిగేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అభిప్రాయపడ్డారు. 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య ఈ సందేశం ఇచ్చారు. ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరపడంపై ఆయన ప్రస్తావించారు.
సంతృప్తి..
ఏకాభిప్రాయ సాధన జరగాలని అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో మహిళ ఓటింగ్ శాతం పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు. ఒక దేశంగా మనం ఆలోచించి మూడు అంచెల సమాఖ్యలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఆ దిశగా దృష్టి సారించి మెరుగైన పాలన దిశగా పయనించాలని కోరారు. మన ప్రజల సర్వతోముఖాభివృద్ధి కృషి చేయాలని వెంకయ్య తెలిపారు. ఎన్నికల ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లడంలో సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇలా ఎంపిక
ఎన్నికల్లో అభ్యర్థులను కూడా వారి యోగ్యత ఆధారంగా ఎన్నుకోవాలని వెంకయ్య సూచించారు. ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. అందరూ ఓటు వేసేలా సంకల్పించుకుందామని సూచించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కనీసం 75 శాతానికి ఓటింగ్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందామని తెలిపారు. ఓటు హక్కు మాత్రమే కాదు.. బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని వెంకయ్య తన సందేశంలో తెలిపారు.
మోడీ కూడా
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఓటింగ్ అంశంపై ప్రస్తావించారు. ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్ శాతం నమోదుపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావంతులు, సంపన్న ప్రాంతాలుగా పరిగణిస్తున్న పట్టణాల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదవు కావడాన్ని ప్రస్తావించారు. 1951-52లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో 45శాతం ఓటింగ్ నమోదైంది. 2019లో కేవలం 67 శాతానికి పెరిగిందని ఆయన గుర్తు చేశారు. భారత్ వంటి శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశంలో ఈ పరిస్థితి మారాలన్నారు.