యూపీలో నేడే కీలకం - నాలుగో దశ పోలింగ్ ప్రారంభం : బరిలో ప్రముఖులు వీరే..!!
దేశ వ్యాప్తంగా ఆసక్తిగా చూస్తున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. యూపీలో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ కు నిర్ణయించారు. అందులో ఇప్పటికే మూడ దశల పోలింగ్ ముగిసింది. ఈ రోజు నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. పీలీభీత్, లఖింపుర్ ఖేరీ, సీతాపుర్, హర్దోయ్, ఉన్నావ్, లఖ్నవూ, రాయ్ బరేలీ, బాందా, ఫతేపుర్ జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. వీటిల్లో 629 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. లఖ్నవూ జిల్లాతోపాటు దశాబ్దాలపాటు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గం పరిధిలోనూ ఈ విడతలోనే ఓటింగ్ జరగనుంది.
Recommended Video
జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపిన లఖింపుర్ ఖేరీ ఘటన జరిగిన నియోజకవర్గంలోనూ ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇదే నియోజకవర్గాల్లో 2017 ఎన్నికల్లో 59 స్థానాల్లో భాజపా-51, ఎస్పీ-4, బీఎస్పీ-3, అప్నాదళ్ ఒకచోట గెలుపొందాయి. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన ఈడీ మాజీ అధికారి రాజేశ్వర్సింగ్ లఖ్నవూ జిల్లా సరోజినీనగర్ స్థానం నుంచి భాజపా తరఫున బరిలో ఉన్నారు.న్యాయశాఖ మంత్రి బ్రిజేశ్ పాఠక్ లఖ్నవూ కంటోన్మెంట్, మరోమంత్రి అశుతోష్ టాండన్ లఖ్నవూ తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గం పరిధిలో రాయ్బరేలీ సదర్, హర్చంద్పుర్, ఊంచాహార్, సరేనీ, బఛ్రావా అసెంబ్లీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలిచారు. ఆ తర్వాత వారు కూడా భాజపాలో చేరారు. రాయ్బరేలీసదర్, హర్చంద్పుర్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన అదితిసింగ్, రాకేశ్సింగ్ ఈసారి అవే స్థానాల్లో కమలం టికెట్పై పోటీచేస్తున్నారు. విద్యార్థి సంఘం మాజీ నాయకురాలు పూజాశుక్లాను ఎస్పీ బరిలో దింపింది. విద్యాకేంద్రంగా పేరొందిన లఖ్నవూ ఉత్తర స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నీరజ్ బోరా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
తొలి మూడు విడతల పోలింగ్ లోనే బీజేపీ..సమాజ్ వాదీ ఎవరికి వారు తమకే మెజార్టీ దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడో విడత పోలింగ్ పైన సమాజ్ వాదీ మరింత ఆశలు పెట్టుకుంది. యాదవ్ బెల్ట్ గా పరిగణించే స్థానాల్లో పోలింగ్ తమకు అనుకూలంగా జరిగిందని విశ్లేషిస్తున్నారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పట్టు ఉన్న రాయ్ బరేలీ పరిధి లో ఈ రోజున పోలింగ్ జరగనుండటంతో..బీజేపీ తొలి నుంచి ఇక్కడ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు జరగిన మూడు విడతల్లోనూ పోలింగ్ శాతం బాగానే ఉండటంతో.. ఈ విడతలోనూ పోలింగ్ భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.