ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేయాలి: ఓవైసీలపైనా శివసేన ఫైర్, విమర్శలు
ముంబై: శివసేన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దేశంలో ముస్లింలకు ఉన్న ఓటు హక్కును రద్దు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. ముస్లిం మతం తరచుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు గురవుతున్నందున ఆ మతస్థులకు ఉన్న ఓటు హక్కును ఉపసంహరించుకోవాలని శివసేన అధికార పత్రిక ‘సామ్నా' తన సంపాదకీయంలో ప్రభుత్వాన్ని కోరింది.
అంతేగాక, అఖిల భారత మజ్లిస్ ఎ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం), ఆ పార్టీ నేతలు ఒవైసీ సోదరులు ‘విషపు పాములు' అని, మైనారిటీ మతస్థులను దోచుకునేందుకు విషం చిమ్ముతుంటారని కూడా సామ్నా సంపాదకీయం విమర్శించింది. ముస్లింలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం పేరిట ఓటు బ్యాంకు రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని సంపాదకీయం పేర్కొంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపేదని, ఇప్పుడు ఇతరులు కూడా తమను తాము లౌకికవాదులుగా చెప్పుకుంటున్నారని విమర్శించింది.
అయితే శివసేన చేసిన డిమాండ్ తీవ్ర స్థాయిలో దుమారం రేపింది. ప్రజలను విభజించడానికే శివసేన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని అనేక రాజకీయ పార్టీలు విరుచుకుపడ్డాయి. శివసేన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ప్రజలలో ఆవేశాలను రగల్చడానికి, సమాజాన్ని చీల్చడానికి శివసేన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించింది. ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
వివిధ మతాల మధ్య శతృత్వాన్ని సృష్టించడానికే శివసేన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించిన సమాజ్వాదీ పార్టీ, ప్రభుత్వం ఆ పార్టీపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో శివసేన తన వ్యాఖ్యల తీవ్రతను తగ్గించి చూపడానికి ప్రయత్నించింది. తమ పార్టీ ‘బుజ్జగింపు రాజకీయాల'కు వ్యతిరేకమని శివసేన అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డాక్టర్ నీలం గోరే పిటిఐకి తెలిపారు.