"50 మంది పాకిస్తాన్ సైనికుల తలలు తీసుకురండి"
‘‘దేశం కోసం నా తండ్రి ప్రాణ త్యాగం చేశారు. ఆయన త్యాగం వూరికే పోకూడదు. అందుకు ప్రతీకారంగా 50 మంది పాకిస్థాన్ సైనికుల తలలు తీసుకురావాలి’’
డియోరియో: పాకిస్తానీ సైన్యం జమ్ము కశ్మీర్లోని పూంచ్ సెక్టార్లోకి చొరబడి మరీ అత్యంత అనాగరికంగా భారత జవాన్ల తలలు నరకడంపై భారతీయుల రక్తం మరిగిపోతోంది. పాక్ సైనికుల చేతిలో దారుణంగా ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ కుమార్తె సరోజ్ కూడా అదే స్థాయిలో స్పందించారు.
ప్రేమ్ సాగర్ మరణవార్త తెలుసుకున్న ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మంగళవారం ప్రేమ్ సాగర్ స్వస్థలమైన ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో ఆయనకు సైనిక లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
అమర జవాను కుమార్తె సరోజ్ మీడియాతో మాట్లాడుతూ... 'దేశం కోసం నా తండ్రి ప్రాణ త్యాగం చేశారు. ఆయన త్యాగం వూరికే పోకూడదు. అందుకు ప్రతీకారంగా 50 మంది పాకిస్థాన్ సైనికుల తలలు తీసుకురావాలి' అని అన్నారు.
'దేశం కోసం ప్రాణాలర్పించిన నా సోదరుడిని చూస్తే ఎంతో గర్వంగా ఉంది. కానీ పాక్ సైన్యం అత్యంత కిరాతకంగా వ్యవహరించింది' అంటూ ప్రేమ్సాగర్ సోదరుడు దయాశంకర్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ఇదే దాడిలో మరణించిన నాయబ్ సబ్ పరమ్జీత్ సింగ్ ఇటీవలనే ఒక ఇల్లు కట్టుకున్నారు. ఆ విషయాన్ని ఆయన సోదరుడు చెప్పారు. తన సోదరుడు ఇటీవలే ఇల్లు కట్టుకున్నారని, ఇంకా గృహప్రవేశం కూడా చేయలేదన్నారు.
ఇప్పుడు ఆయనకు బదులు ఆయన శవంతో గృహప్రవేశం చేయించాలని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని, అది తమకు గర్వకారణంగా ఉందని పరమ్జీత్ కుమార్తె సిమ్రన్దీప్ వ్యాఖ్యానించారు.