హస్తిన అభివృద్ధికి మోడీ ఆశీస్సులు కావాలి, విధాతలు మీరే.. ప్రజలనుద్దేశించి అరవింద్ కేజ్రీవాల్
కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో కలిసి పనిచేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఢిల్లీని నెంబర్ వన్ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామన్నారు. ఇందుకు ప్రధాని మోడీ సహకారం, ఆశీస్సులు అవసరమని అభిప్రాయపడ్డారు. మూడోసారి ఢిల్లీ సీఎంగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మీ కుమారుడిని..
ఢిల్లీ అభివృద్ధి నినాదంతో కేజ్రీవాల్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తాను ఢిల్లీ సీఎం కాదని, మీ కుమారుడిని అని చేసిన ప్రచారం కలిసొచ్చింది. ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలు తన కుటుంబసభ్యులని కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. దీంతో ప్రజలు ఆప్కు మరోసారి పట్టం కట్టారు. 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 62 సీట్లు కట్టబెట్టారు. ఆదివారం మధ్యాహ్నం రాంలీలా మైదానంలో ఆశేష జనవాహిని మధ్య కేజ్రీవాల్ సహా ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

మోడీ గైర్హాజరు..
ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోడీని కేజ్రీవాల్ ఆహ్వానించారు. అయితే ఆదివారం తన నియోజకవర్గం వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోడీ వెళ్లడంతో.. ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. కానీ ఢిల్లీలో తమకు ప్రధాని మోడీ ఆశీస్సులు కావాలి అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 20 నిమిషాల తన ప్రసంగంలో ప్రధాని మోడీ పేరు ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదేకాదు ఇతర రాష్ట్రాల సీఎంలు, వీఐపీలను ఆహ్వానించని కేజ్రీవాల్.. ప్రధాని మోడీని ఇన్వైట్ చేశానని చెప్పడం విశేషం.

ప్రజల గెలుపు...
మూడోసారి ఆప్ గెలవడం తమ విజయం కాదు, ఇదీ ప్రజల గెలుపు అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గత ఐదేళ్లలో ఢిల్లీ అభివృద్ధి కోసం పనిచేశానని.. మరో ఐదేళ్లు కూడా అదే అంకుఠిత దీక్షతో వర్క్ చేస్తామన్నారు. భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ కేజ్రీవాల్ ప్రసంగాన్ని ప్రారంభించారు. గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగుతాయని కేజ్రీవాల్ స్పష్టంచేశారు. విద్య, ఆరోగ్యానికి సంబంధించి పథకాలు యథావిధిగా అమలవుతాయని పేర్కొన్నారు.

రాజకీయాల్లో కొత్త పంథా..
ప్రపంచంలో ప్రకృతి మనకు అన్నీ ఉచితంగానే ఇస్తోంది. మన తల్లి కూడా అలాగే అందజేస్తోంది. తండ్రి ఆశీస్సులు అందజేస్తున్నారు. అలాగే తాను కూడా ఢిల్లీ ప్రజల మేలు కోసం సంక్షేమ చర్యలు తీసుకుంటున్నానని కేజ్రీవాల్ స్పష్టంచేశారు. ఢిల్లీ రాజకీయాలు సరికొత్త పంథాకు మారాయని కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఎన్నికలతో మార్పు సాధ్యమైందని గుర్తుచేశారు.

విధాతలు మీరే
ఢిల్లీ రూపురేఖలు మార్చే విధాతలు ప్రజలేనని కేజ్రీవాల్ ఉన్నారు. రాంలీలా మైదానంలో లక్షలాది మంది ఆశీనులయ్యారని.. రాజకీయ నేతలు వస్తారు, వెళ్తారు.. కానీ విధాతలు మాత్రం మీరేనని.. అందులో మార్పు ఉండబోదని... ఆశేష జనవాహిన కరతాళధ్వనుల మధ్య కేజ్రీవాల్ ప్రసంగించారు.












Click it and Unblock the Notifications