అతని వాంగ్మూలం వల్లే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారా ? పోలీసు అధికారిపై కేజ్రీవాల్ ఆరోపణలు!!
దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ఈడి విచారణను ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఒక పోలీసు ఉన్నతాధికారి పై సంచలన ఆరోపణలు చేశారు.
ఢిల్లీ పోలీస్ అధికారి ఒకరు తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన దరఖాస్తులో ఈ విషయాన్ని ఆయన పేర్కొన్నారు. తన భద్రతా వలయంలో ఉన్న సిబ్బంది నుంచి ఆయనను తొలగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు కేజ్రీవాల్.

గతంలో మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పై అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ పోలీస్ అధికారి, ఇప్పుడు తనతో కూడా దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు చేసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ను కోర్టు ముందు హాజరు పరుస్తున్న క్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏకే సింగ్ తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆయన తన దరఖాస్తులో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ ను రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, ఇదంతా బిజెపి ఆడుతున్న డ్రామా అని ఆప్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఢిల్లీ మంత్రి అతిషి కేవలం మద్యం కుంభకోణంలో ఒకే ఒక వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంతో సీఎం కేజ్రీవాల్ అరెస్టు చేశారని వ్యాఖ్యలు చేశారు.
అరబిందో ఫార్మా అధినేత శరత్ చంద్రారెడ్డి, అరవింద్ కేజ్రీవాల్ ను కలిశానని చెప్పడంతో ఆయనను అరెస్టు చేసినట్టు ఆమె పేర్కొన్నారు. మొదట శరత్ చంద్రారెడ్డి తాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కలవలేదని చెప్పారని, ఈ కేసులో అరెస్టై జైలు జీవితం అనుభవించిన తర్వాత అరవింద్ కేజ్రివాల్ పేరు చెప్పారని, ఇందులో బిజెపి కుట్ర ఉందని ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications