డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన ఈ కానిస్టేబుల్ ఏంచేశాడో తెలుసా..?
మద్యం సేవించి బైకు నడిపి పోలీసులకు చిక్కిన వ్యక్తి తన బైకుకు నిప్పుపెట్టిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... విశాఖపట్నంకు చెందిన కానిస్టేబుల్ శివ సత్యనారాయణ మద్యం సేవించి దువ్వాడలో బైకు నడిపాడు. అదే సమయంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. తనిఖీల సందర్భంగా శివ మద్యం పరిమితికి మించి సేవించినట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. బ్రీత్ అనలైజర్లో 53ఎంజీ మద్యం సేవించినట్లు తేలింది. దీంతో కేసు నమోదు చేసిన ట్రాఫిక్ పోలీసులు చలాన్ రాసి అతని బైకును స్వాధీనం చేసుకున్నారు. కౌన్సిలింగ్కు సెప్టెంబర్ 12వ తేదీనా రావాలని కోరారు.
పెట్రోల్ బంకులో బైకులో చెలరేగిన మంటలు
కౌన్సిలింగ్కు శివ అటెండ్ అయ్యాడు. అనంతరం తనకు విధించిన జరిమానా కట్టాడు శివసత్యనారాయణ. జరిమానా కట్టడంతో పోలీసులు శివసత్యనారాయణకు బైకు తాళాలు ఇచ్చారు. బైకు దగ్గరకు వెళ్లిన శివ తన దగ్గరున్న అగ్గిపెట్ట తీసుకుని బైకు పెట్రోల్ ట్యాంకు ఓపెన్ చేసి నిప్పంటించాడు. ఒక్కసారిగా ఆయన ఎందుకు అలా ప్రవర్తించాడో ఎవరికీ అర్థంకాలేదు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి నష్టం జరగలేదు.ఈ ఘటనను తాము ఊహించలేదని దువ్వాడ పోలీసులు చెప్పారు. వెంటనే మంటలను ఆర్పి శివసత్యనారాయణను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
ఎందుకు అలా బైకుకు నిప్పు పెట్టావని అడిగినప్పుడు శివసత్యనారాయణ ఇచ్చిన సమాధానంతో షాక్ అయ్యారు అధికారులు. తన బైకు వల్లే ఇదంతా జరిగిందని తను ఇప్పుడు తలెత్తుకోలేకపోతున్నట్లు సమాధానం ఇచ్చాడని పోలీసులు చెప్పారు. ఒకవేళ తనకు బైకు లేకుంటే ఇదంతా జరిగేది కాదని పశ్చాత్తాప పడ్డట్లు పోలీసులు తెలిపారు. అయితే విశాఖ త్రీటౌన్ పోలీసులు శివసత్యనారాయణపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనేదానిపై స్పష్టత రాలేదు.