ఆయన మరణం కలిచివేసింది: పవన్ కల్యాణ్.. జనసేన అధినేతలో అదే స్ఫూర్తి.. రాజేంద్రసింగ్
గంగా ప్రక్షాళన కోసం ప్రాణత్యాగం చేసిన జీడీ అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ పర్యావరణ అవశ్యకత గురించి స్పందించారు. ఈ కార్యక్రమంలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ..
జనసేన అధినేత పవన్ కల్యాణ్లో జీడీ అగర్వాల్ పోరాట స్ఫూర్తిని చూశాను. జీడీ అగర్వాల్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించిన వెంటనే పవన్ కల్యాణ్ ఒక్క సెకన్ కూడా ఆలోచించలేదు. తప్పకుండా హాజరవుతానని చెప్పి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నారు. గంగా ప్రక్షాళన కోసం కృషి చేయాలని పవన్ కల్యాణ్కు సూచిస్తున్నాను అని రాజేంద్ర సింగ్ అన్నారు.
రాజేంద్ర సింగ్ సూచనను అంగీకరిస్తూ గంగా ప్రక్షాళనపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. గంగను కాలుష్యానికి గురిచేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమే. తాను పోరాట యాత్రలో ఉండగా జీడీ అగర్వాల్ మరణ వార్త తెలిసింది. ఓ మహత్తర కార్యక్రమం కోసం ప్రాణాలు అర్పించడం నన్ను కలిచి వేసింది. ఆ రోజునే హరిద్వార్కు వచ్చి జీడీ అగర్వాల్కు శ్రద్దాంజలి ఘటించాలని అనుకొన్నాను. పోరాట యాత్రలో ఉన్నందున సాధ్యపడలేదు అని పవన్ కల్యాణ్ అన్నారు.
దివంగత జీడీ అగర్వాల్ విషయానికి వస్తే.. ఆయన పూర్తి పేరు గురుదాస్ అగర్వాల్. గంగా ప్రక్షాళన కోసం నిరంతర రాజీ లేని పోరాటం చేశారు. విద్యావేత్తగా, ఆధ్యాత్మిక గురువుగా ఎన్నో సామాజిక అంశాలపై ఉద్యమించారు. గంగా ప్రక్షాళన కోసం పోరాటం చేస్తూ 2018 అక్టోబర్ 11వ తేదీన ఆత్మార్పణ చేసుకొన్నారు. 1905లో పండిట్ మదన్ మోహన్ మాలవీయ స్థాపించిన గంగా మహాసభకు గౌరవ అధ్యక్షుడిగా సేవలందించారు.