ముఖ్యమంత్రిగా ఉండి ఇదేం పద్ధతి: మమతా బెనర్జీపై గవర్నర్ ఆగ్రహం
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేపట్టనున్న ర్యాలీపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా నిరసనలతో అట్టుడుకుతున్న రాష్ట్రంలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించకుండా ముఖ్యమంత్రే నిరసనలు చేపట్టడం ఏంటని మండిపడ్డారు.
ఢిల్లీలో పౌరసత్వ నిరసన జ్వాలలు: బస్సులు దగ్ధం: మా పని కాదంటోన్న జామియా వర్శిటీ
ముఖ్యమంత్రిగా ఉండి ఇలానా?
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి, మంత్రులు ర్యాలీ చేపడతామనడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్ అన్నారు. ప్రస్తుత ఆందోళనకర పరిస్థితిని సద్దుమణిగేలా చేయకుండా ఇలాంటి ర్యాలీలు చేపట్టి వాటిని మరింత రెచ్చగొట్టే విధంగా చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని గవర్నర్ జగదీప్ దనకర్ అన్నారు.
భారీ ఎత్తున మమత ర్యాలీ
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై గవర్నర్ మండిపడ్డారు. కాగా, మమతా బెనర్జీ చేపట్టనున్న ర్యాలీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమై.. జోరాంసకో థాకుర్బరి వద్ద ముగియనుంది. ఈ ర్యాలీలో సీఎంతోపాటు రాష్ట్ర మంత్రులు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరుకానున్నారు. ప్రజలంతా ఈ ర్యాలీలో పాల్గొనాలంటూ మమతా బెనర్జీ పిలుపునివ్వడం గమనార్హం.
పశ్చిమబెంగాల్ రెచ్చిపోయిన ఆందోళనకారులు
గత నాలుగు రోజులుగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆందోళనకారులు విధ్వంసాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఓ రైలుతోపాటు ఐదు రైల్వే స్టేషన్లను ఆందోళనకారులు తగలబెట్టడం గమనార్హం. కాగా, ఆందోళనకారుల్లో ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి వలసదారులే ఉన్నట్లు ప్రతిపక్ష పార్టీల నేతలు అంటున్నారు. ఆందోళనల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మమతా బెనర్జీనే ఆందోళనలను ప్రోత్సహిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
అస్సాంలోనూ..
పశ్చిమబెంగాల్ తోపాటు అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అస్సాంలో కూడా ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులు భారీ ఎత్తున మోహరించి పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తున్నారు. నిరసన పేరుతో విధ్వంసానికి, హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే అస్సాం ముఖ్యమంత్రి సర్బనంద సోనోవాల్ స్పష్టం చేశారు. అసలైన భారతీయులకు పూర్తి రక్షణ ఉంటుందని చెప్పారు. పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇందులో రోహింగ్యాలే ఎక్కువగా ఉన్నారు.