ఏ పార్టీకీ భయపడం: మోడీ వారణాసి ర్యాలీపై ఈసి
న్యూఢిల్లీ: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ర్యాలీకి అనుమతి నిరాకరించడాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) సంపత్ సమర్థించుకున్నారు. భద్రత విషయంలో స్థానిక అధికారుల మాటలను విస్మరించలేమని ఆయన అన్నారు. తాము నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నామని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి గానీ, ఎవరికి గానీ భయపడే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.
దేశవ్యాప్తంగా పోలింగ్ సజావుగాీ జరుగుతున్న నేపథ్యంలో తమపై విమర్శలు చేయడం బాధాకరమని ఆయన అన్నారు. రాజ్యాంగబద్దమైన ఈసి గురించి మాట్లాడేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా పరిపక్వతను ప్రదర్శించాలని ఆయన సూచించారు. ఈసిపై అనుమానాలు లేవనెత్తడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
ఫిర్యాదుల విషయంలో ఈసిపై అనుమానాలు అక్కరలేదని, రాజకీయ పార్టీల ఫిర్యాదులపై విచారణ జరిపిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. రిటర్నింగ్ అధికారులను మారుస్తున్నామన్న వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. రాజ్యాంగ విలువల పరిరరక్షణకు ఈసి కట్టుబడి ఉందని చెప్పారు. కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ విషయంలో నివేదిక కోరినట్లు తెలిపారు. తాము నిజాయితీగా, ధైర్యంగా పనిచేసుకుని పోతామని ఆయన అన్నారు.
కాగా, ఈసి నిర్ణయానికి వ్యతిరేకంగా బిజెపి వారణాసిలో ఆందోళనకు దిగింది. చాలా ప్రాంతాల్లో తాను సమావేశాలు పెట్టానని, వారణాసిలోనే భద్రత సమస్య ఎదురవుతుందా అని నరేంద్ర మోడీ అడిగారు.