ఎక్కడైనా పోరాడగలం..! భారత్ అమ్ములపొదిలో సరికొత్త అస్త్రాలున్నాయన్న మోదీ..!!
ఉత్తర్ప్రదేశ్/హైదరాబాద్ : భూమి, ఆకాశం, అంతరిక్షం, జలం ఎక్కడైనా సరే.. మెరుపుదాడులు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్దంగా ఉందని, అందుకు సరిపోయే అస్త్రాలు కూడా భారత్ అమ్ముల పొదిలో ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. దేశం కోసం అసాద్యమనుకున్న కార్యక్రమాలను సుసాద్యం చేసి చూపిస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మింగుడుపడడం లేదని ఆయన ప్రశ్నించారు. దేశాన్ని సస్యశ్యామలంగా ఉంచడం ఎంత ముఖ్యమో శత్రువులనుండి కక్షించుకోవడం కూడా అంతే ముఖ్యమని ప్రధాని అన్నారు.
దేశాన్ని కాపాడేది ఒక్క బీజేపినే..! ఉత్తర్ ప్రదేశ్ లో మోదీ ప్రకటన..!!
ఇది చౌకీదార్ ప్రభుత్వం. మెరుపుదాడులు నిర్వహించడానికి ధైర్యం ఉన్న సర్కారు. దేశం అభివృద్ధి చెందాలి.. శత్రువుల నుంచి భద్రత పొందాలి. భూమి, ఆకాశం, అంతరిక్షం.. ఎక్కడైనా సరే మెరుపుదాడులు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ధైర్యం ప్రదర్శిస్తోంది. అభివృద్ధి మార్గంలో అడుగులు వేసే పార్టీ మాది. కానీ, ఇతర పార్టీలకు ఓ విధానం, విజన్ ఏమీ లేదని ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా విమర్శించారు.
గత ప్రభుత్వం దేశ భద్రతకోసం చేసిందేమీ లేదు..! బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేదన్న మోదీ..!!
తాము 2019 ఎన్నికల్లో ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న విషయంపై దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని మోదీ తెలిపారు. ఇక్కడ ర్యాలీలో పాల్గొన్న ప్రజలే అందుకు నిదర్శనమని తెలిపారు. 1857లో మేరఠ్ నుంచే బ్రిటీష్ వారిపై తిరుగుబాటు మొదలైందని, ఎన్డీఏ ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను వివరించడమే కాకుండా, గత యూపీఏ ప్రభుత్వం చాలా విషయాల్లో ఎందుకు విఫలమైందని కూడా ప్రజలకు వివరిస్తామన్నారు ప్రధాని.
ఏ మార్గంలోనైనా శత్రువులను మట్టి కరిపిస్తాం..! యాంటీ శాటిలైట్ ప్రయోగం ఓ చరిత్ర అన్న ప్రధాని..!!
ఓ వైపు తాము చేస్తున్న అభివృద్ధి ఉందని, మరోవైపు విజన్ లేని వారు ఉన్నారని మోదీ అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, కొత్త యుద్ధ విమానాలు కావాలని మన వైమానిక దళం గత ప్రభుత్వాన్ని కోరిందని కానీ, వారి విజ్ఞప్తులను ఆ సర్కారు నిరాకరించిందని మోదీ తెలిపారు. కనీసం బుల్లెట్ప్రూఫ్ జాకెట్లను కూడా అందించలేదని విమర్శించారు. యాంటీ శాటిలైట్ ప్రయోగం చేయడానికి కూడా శాస్త్రవేత్తలకు అనుమతి ఇవ్వలేదని గత కాంగ్రెస్ ప్రభుత్వంపై మోదీ నిప్పులు చెరిగారు.
బీజేపికి ఎన్నిసీట్లు ఇవ్వాలో దేశ ప్రజలు నిర్ణయించారన్న మోదీ..! యూపీలో ఉద్వేగ ప్రసంగం..!!
యాంటీ శాటిలైట్ ప్రయోగించి మనం సాధించిన ఘనతపై ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి వ్యాఖ్యలు చేశాయో దేశ ప్రజలు విన్నారని మోదీ గుర్తు చేసారు. గత ప్రభుత్వ హయాంలో దేశంలోని మహిళలు సురక్షితంగా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఉత్తర్ప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లపై నేరస్తులు తిరగడానికే బయపడుతున్నారు అని మోదీ వ్యాఖ్యానించారు.