ఢిల్లీ ప్రభుత్వాన్ని నడపాలని మాకు లేదు: రాజ్నాథ్, రాహుల్పై ఫైర్
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని తామే నడపాలనే ఉద్దేశ్యం తమకు లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఆ పార్టే నడుపుకోవచ్చని తెలిపారు.
కేవలం కొన్ని రాజ్యాంగపరమైన నియమాలను మాత్రమే అమలు చేయాలనుకుంటున్నామని తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్కు రాజ్యాంగం అధికారుల బదిలీ, సీనియర్ అధికారుల నియామంకు సంబంధించిన కొన్ని అధికారాలను ప్రసాదించిందని వివరించారు.
రాహుల్పై మండిపడిన రాజ్నాథ్
ఇది ఇలా ఉండగా, ఆర్ఎస్ఎస్ అపరిపక్వ సంస్థ అంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాజ్నాథ్ మండిపడ్డారు. గుజరాత్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీకి భారతీయ సంస్కృతి, విలువలు తెలియవని ఎద్దేవా చేశారు.
ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావించే సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్కే చెల్లుతాయన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాలు, విలువలపై వ్యాఖ్యలు చేసే స్థాయి రాహుల్కి లేదన్నారు. మైనార్టీల్లో భయాందోళనలు కల్పిస్తూ గత ప్రభుత్వాలు పబ్బం గడుపుకున్నాయని, తాము అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రధాని విదేశీ పర్యటనలపై విమర్శించే ముందు రాహుల్ ఎవరికీ చెప్పకుండా రెండు నెలలు ఎక్కడికి వెళ్లారో చెప్పాలన్నారు.
రామ మందిరంపై రాజ్నాథ్
అయోధ్య రామ మందిర వివాదానికి ప్రభుత్వం కోర్టు బయట పరిష్కారానికి స్వాగతం పలుకుతోందని రాజ్నాథ్సింగ్ పేర్కొన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంవత్సర కాలంలో సాధించిన విజయాలపై రాజ్నాథ్ సింగ్ శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
'అన్ని సమస్యలు ముఖ్యమైనవే.. ప్రస్తుతం మా ప్రభుత్వం అభివృద్ధే అజెండాగా పని చేస్తోంది..' అని పేర్కొన్నారు. సమస్యలను ప్రాధాన్యతల వారీగా పరిష్కరిస్తామన్నారు. అయోధ్య రామాలయం వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, తాము కోర్టు తీర్పుకై వేచి చూస్తున్నామని, రెండు వర్గాల వారు కలిసి చర్చించుకుంటే సమస్యను పరిష్కరించుకోవచ్చని రాజ్నాథ్ అన్నారు.
కేజ్రీవాల్కు సుప్రీంలో చుక్కెదురు: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై స్టే
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులు అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. అధికారాల వ్యవహారంలో నాలుగు రోజుల క్రితం హైకోర్టులో కేజ్రీవాల్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే, శుక్రవారం నాడు కేజ్రీవాల్కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.
ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రత్యేక అధికారాల పైన కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ పైన హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పైన సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన న్యాయస్థానం, ఆప్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
మూడు వారాల్లోగా నోటీసు పైన స్పందించాలని ఆదేశించింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన నోటిఫికేషన్ను పరిశీలించారని హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. హైకోర్టులో చుక్కెదురు కావడంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో, దానిని విచారించింది.