మరో ప్రమాదం!: పన్నీరుకు ఊహించని షాకిచ్చిన శశికళ
అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో తమిళనాట రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది.
చెన్నై: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో తమిళనాట రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. శశికళకు జైలు శిక్ష పడటంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కొనసాగే అవకాశాలున్నాయని భావించారు.
కానీ, అనూహ్యంగా శశికళ పళనిస్వామి పేరు తెరపైకి తీసుకు వచ్చింది. ఆమె వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు శాసన సభా పక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. దీంతో పన్నీరుకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది.
అరెస్టుకు రంగం సిద్ధం: ఇప్పుడు శశికళ ఏం చేయవచ్చు?
శశికళకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలే ఇప్పుడు పళని స్వామికి మద్దతిస్తున్నారు. తీర్పుకు ముందు 118 మంది ఎమ్మెల్యేలు శశికళకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు చిన్నమ్మ.. పళనిస్వామిని ఎంపిక చేయడంతో వారంతా ఆయన వైపు ఉన్నారు.
దీంతో తమిళనాట సరికొత్త రాజకీయం తెరపైకి వచ్చింది. ఇప్పుడు పళని స్వామి - పన్నీరు సెల్వం ఫ్లోర్ టెస్ట్లో బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది.
మంగళవారం నాడు పళని స్వామి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారని, ఎమ్మెల్యేలు అందరూ తన వైపే ఉన్నారని చెప్పారు. దీంతో లైన్ క్లియర్ అయిందనుకున్న పన్నీర్ వర్గానికి ఊహించని సమస్య ఎదురైంది.
గవర్నర్ పళని స్వామి లేఖపై తీసుకునే నిర్ణయంతో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే పళని స్వామి సీఎం అయినా అవుతారు. అయితే గవర్నర్ బల పరీక్షకు అవకాశం ఇస్తే తమిళనాడు అసెంబ్లీలో బలాబలాలను ఆధారంగా చేసుకుని తదుపరి సీఎం ఎవరనేది తేలనుంది. తాను సీఎం కాకపోయినా పర్వాలేదు కానీ, పన్నీర్ సెల్వం కాకూడదనే ఉద్దేశంతో శశికళ ఇదంతా చేస్తున్నారని అంటున్నారు.