ఈ 9 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించాల్సిందే, 2024లో కూడా: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి, గెలవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ నేతలకు స్పష్టం చేశారు. సోమవారం జరిగిన బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశం అనంతరం సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ మీడియాకు ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
9 రాష్ట్రాలకు గానూ తొమ్మిది రాష్ట్రాల్లోనూ బీజేపీ జయకేతనం ఎగరవేయాల్సిందేనని జేపీ నడ్డా స్పష్టం చేశారని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. '2023 చాలా ముఖ్యమైనదని బీజేపీ అధ్యక్షుడు అన్నారు. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల్లో పోరాడి గెలవాలి, ఆపై 2024లో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలి' అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
మనం బలహీనంగా ఉన్న బూత్లను బలోపేతం చేయాలని ప్రధాని చెప్పారని.. అలాంటి 72,000 బూత్లను గతంలోనే గుర్తించామని, నేడు 1.30 లక్షల బూత్లను బలోపేతం చేశామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు అని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
బీజేపీ చీఫ్ ఇటీవల ముగిసిన ఎన్నికలపై కూడా చర్చించారని, గుజరాత్ విజయం చారిత్రాత్మకమని, అపూర్వమని ప్రసాద్ అన్నారు. హిమాచల్ ఎన్నికల గురించి నడ్డా మాట్లాడుతూ.. ప్రభుత్వాలను మార్చే సంప్రదాయాన్ని మార్చాలని అనుకున్నామని, అయితే అలా చేయలేకపోయామని అన్నారు.
Delhi | BJP chief JP Nadda said in National Executive Meet that 2023 is very important & that we have to fight & win 9 state elections this year & then general elections in 2024: BJP leader RS Prasad pic.twitter.com/YsAOSbF0v2
— ANI (@ANI) January 16, 2023
పార్టీలో సమాజంలోని అన్ని వర్గాల ప్రాతినిధ్యం, దాని నాయకత్వం గురించి కూడా నడ్డా మాట్లాడారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో, మొబైల్, కార్ల తయారీ, వందే భారత్ రైళ్లలో భారతదేశం దూసుకుపోవడం, ఆర్థిక పరంగా యూకేని ఆక్రమించడం వంటివి హైలైట్ చేయబడ్డాయని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కాగా, తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నేతలు ఈటల రాజేందర్, డాక్టర్ లక్ష్మణ్, వివేక్, డీకే అరుణ, విజయశాంతి, ఏపీ నుంచి పురంధేశ్వరితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.