జీవితం గొప్పదని మోడీ, ఏఏపీ వల్లేనని రాజ్: చేతులు జోడించి వెంకయ్య
న్యూఢిల్లీ: రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య పైన గురువారం పార్లమెంటు దద్దరిల్లింది. రైతు ఆత్మహత్యల పైన ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశారు. మనిషికి జీవితం కంటే గొప్పది మరేదీ లేదన్నారు. రైతు ఆత్మహత్యలు ఎప్పటి నుండో మనల్ని కలచివేస్తున్నాయన్నారు. దేశాన్ని తీవ్రంగా కలవరపరిచే అంశాల్లో రైతు ఆత్మహత్యలు ఒకటి అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల బాధను తాము అర్థం చేసుకోగలమన్నారు.
అలాంటి జీవితాన్ని కోల్పోతున్న రైతు సమస్యలను మనం అర్థం చేసుకోవాలన్నారు. రైతుల ఆత్మహత్యలు ఎప్పటి నుండో కలచివేస్తున్నాయన్నారు. రైతు ఆత్మహత్యలు ఆపడం కోసం విపక్షాల నుడి సూచనలు ఆహ్వానిస్తున్నామన్నారు. వచ్చిన సలహాలు, సూచనలు సహృదయంతో స్వీకరిస్తామని చెప్పారు. కష్టాల్లో ఉన్న రైతులను ఒంటరిగా వదిలేయబోమని చెప్పారు.

రాజకీయం వద్దు: రాజ్ నాథ్
రైతుల ఆత్మహత్యల పైన రాజకీయం వద్దని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అధికార, విపక్షాలు రైతులకు భరోసా కల్పించాలన్నారు. రైతు ఆత్మహత్య నివారణ దిశగా కార్యాచరణ ప్రణాళిక తెస్తామని చెప్పారు. భూసార పరీక్షలు చేసి రైతులకు న్యాయం చేస్తామన్నారు. రైతుల సంక్షేమానికి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. ఏఏపీ కార్యకర్తల తీరుతో ఆత్మహత్య చేసుకున్న గజేంద్ర సింగ్కు సకాలంలో వైద్యం అందలేదన్నారు. పోలీసుల హెచ్చరికలను ఏఏపీ కార్యకర్తలు పట్టించుకోలేదన్నారు.
విచారణ జరిపించాలి: ఖర్గే
గజేంద్ర సింగ్ ఆత్మహత్య పైన విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. పోలీసుల పనితీరు పైన విచారణ జరగాలన్నారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగవని ప్రధాని భరోసా ఇవ్వాలన్నారు.
చేతులు జోడించి వేడుకుంటున్నా: వెంకయ్య
ఏఏపీ ర్యాలీలో ఆత్మహత్య చేసుకున్న రైతు గజేంద్ర సింహ్ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని తాను చేతులెత్తి వేడుకుంటున్నానని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన లోకసభలో రెండు చేతులు జోడించి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications