రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత కొత్త ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు: ఆయుధాల్లేకుండా పోరాటం
న్యూఢిల్లీ: భారత కొత్త ఆర్మీ చీఫ్ జనరల్గా నియమితులైన మనోజ్ పాండే ఇవ్వాళ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా పలు కీలక అంశాలపై ఆయన మాట్లాడారు. లఢక్ సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితులకు కారణమౌతోన్న చైనా పైనా ఆయన స్పందించారు. భవిష్యత్లో ఎదురయ్యే పరిణామాలను ముందుగానే అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉందని, దీనికి అనుగుణంగా తమను తాము బలోపేతం చేసుకోవాలని పేర్కొన్నారు.
అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. లఢక్ తూర్పు ప్రాంత సరిహద్దుల్లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తరచూ ఉద్రిక్త పరిస్థితులకు కారణమౌతోందని వ్యాఖ్యానించారు. చైనా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఇంచ్ భూమిని కూడా పోగొట్టుకోమని, ధారదాత్తం చేసుకోబోమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పారు. లఢక్ సరిహద్దు, వాస్తవాధీన రేఖ విషయంలో భద్రత బలగాలు పూర్తి అప్రమత్తతతో ఉన్నాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను మరింత పెంచడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని, ఈ దిశగా చర్యలు తీసుకుంటామని మనోజ్ పాండే చెప్పారు. సరిహద్దుల్లో వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా మౌలిక వసతులను సమకూర్చుకోవాల్సి ఉందని అన్నారు.
యుద్ధ సామాగ్రి తరలింపు, భారీ వాహనాల రాకపోకలు సాగించడానికి అనువుగా రవాణా వ్యవస్థను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు. లఢక్ తూర్పు ప్రాంతం సహా సరిహద్దుల్లో ఆర్మీ రవాణాను మెరుగుపర్చుతామని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంపై మనోజ్ పాండే తన అభిప్రాయాలను పంచుకున్నారు. భవిష్యత్లో ఆయుధ రహిత యుద్ధాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదని అంచనా వేశారు.
దీనికి అనుగుణంగా సైన్యం తనను తాను తీర్చుదిద్దుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ సైబర్ యుద్ధాలు తలెత్తవచ్చని చెప్పారు. ఆయుధ, ఆయుధ రహితంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా సామర్థ్యాన్ని పెంచుకుంటామని అన్నారు. అత్యాధునిక ఆయుధ సామాగ్రిని సైతం సమకూర్చుకుంటున్నామని పేర్కొన్నారు. సాంకేతిక పరంగా కూడా సైన్యం అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.












Click it and Unblock the Notifications