నేపాలీ మహిళలపై రేప్: భారత్ వదిలిపోయిన సౌదీ అంబాసిడర్
న్యూఢిల్లీ: భారత్లోని సౌదీ దౌత్య కార్యాలయం అధికారి గురువారం భార్యతో కలిసి భారత్ వదిలి సౌదీ అరేబియాకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఇద్దరు నేపాలీ మహిళలను నిర్భందించి, వారిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడినట్లు సౌదీ అంబాసిడర్పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు భారత్ వదిలి వెళ్లిపోయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. సౌదీ అరేబియా అంబాసిడర్ తమను గుర్గావ్లో నిర్భంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ నేపాల్కు చెందిన తల్లీ కూతుళ్లు ఆరోపించిన ఘటన బుధవారం సంచలనం సృష్టించింది.
ఓ స్వచ్చంద సంస్ధ ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో స్పందించిన అధికారులు సౌదీ అంబాసిడర్ వద్ద బందీలుగా ఉన్న నేపాలీ మహిళలను విడిపించిన స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ దర్యాప్తు చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు.
మరోవైప్ సౌదీ అంబాసిడర్పై వచ్చిన ఆరోపణలను సౌదీ ఖండించింది. వియన్నా ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తోందంటూ ఆరోపించింది. గుర్గాన్లోని లీలా అంబియెన్స్లోగల కైట్రియోనా అపార్ట్మెంట్లో ఇద్దరు నేపాలీ మహిళలు నిర్భంధంలో ఉన్నారని మైటీ ఇండియా అనే స్వచ్చంధ సంస్ధ ఈ నెల 7వ తేదీన స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళలను కాపాడి, వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు.