10 రోజుల్లో - హిందుస్తానీగా: గులాం నబీ ఆజాద్ సంచలనం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్.. ఇక సొంత కుంపటి పెట్టుకోనున్నారు. జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా సొంతంగా పార్టీని నెలకొల్పడానికి సమాయాత్తమౌతోన్నారు. ఇందులో భాగంగా ఆయన విస్తృతంగా పర్యటిస్తోన్నారు. అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆజాద్ తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకున్నారు. దీనికి అనుగుణంగా నిత్యం ఆయన జనంలో ఉంటోన్నారు.
లిక్కర్ స్కాంలో దొరకలేదు కదా అని.. మరో రూటులో నరుక్కొస్తోన్న మోదీ-సీబీఐ
ఆజాద్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తోన్న ఆజాద్.. ఏకంగా పార్టీ నుంచి తప్పుకొన్నారు. పార్టీతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న అనుబంధాన్ని తెంచుకున్నారు. వెళ్తూ, వెళ్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రాహుల్ గాంధీని టార్గెట్గా చేసుకుని విమర్శలను సంధించారు.
ఇప్పుడాయన జమ్మూ కాశ్మీర్లో సొంతంగా రాజకీయ పార్టీని నెలకొల్పే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీ నుంచి విస్తృతంగా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. అన్ని జిల్లాల్లోనూ పర్యటించేలా షెడ్యూల్ను రూపొందించుకున్నారు. తొలి బహిరంగ సభనను జమ్మూలో ఏర్పాటు చేశారు. దశలవారీగా పర్యటనలను నిర్వహిస్తోన్నారు. ఇవ్వాళ బారాముల్లా జిల్లాలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
తాను నెలకొల్పబోతోన్న కొత్త రాజకీయ పార్టీపై గులాం నబీ ఆజాద్ క్లారిటీ ఇచ్చారు. 10 రోజుల్లో పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు. జమ్మూకాశ్మీర్కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా సాధించడమే లక్ష్యంగా పార్టీని నెలకొల్పనున్నానని చెప్పారు. అదే ప్రధాన అజెండాగా మారుతుందని స్పష్టం చేశారు. పార్టీ జెండా-అజెండా ఏమిటనేది త్వరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. హిందుస్తానీ అనే పేరు తన పార్టీలో ప్రతిధ్వనిస్తుందని, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పార్టీ పేరును గుర్తు పెట్టుకునేలా ఉంటుందని అన్నారు.
పార్టీ పేరు ఏమిటనేది తానింకా నిర్ధారించలేదని, హిందుస్తానీ అనే పదాలు మాత్రం ఇందులో ఖచ్చితంగా ఉంటాయని చెప్పారు. భూ హక్కు కల్పన, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే దిశగా ఈ కొత్త రాజకీయ వేదిక ద్వారా పోరాటం చేస్తామని గులాం నబీ ఆజాద్ వివరించారు. కాంగ్రెస్ పార్టీ తనను విమర్శించడాన్ని తప్పు పట్టారు. తనలాంటి సీనియర్ నాయకులు రక్తం ధారపోయడం ద్వారా పార్టీ బలోపేతమైందని వ్యాఖ్యానించారు.