కాంగ్ కాదు సిబిఐ పోటీ చేస్తుంది: మోడీ, గాంధీ కలపై..
భోపాల్: వచ్చే ఎన్నికలలో పోటీ చేసేది కాంగ్రెసు పార్టీ కాదని, సిబిఐ అని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ బుధవారం అన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. తమ పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ అందరికీ మార్గదర్శి అని చెప్పారు. అదే సమయంలో ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు.
మధ్యప్రదేశ్లో పేదరికం తగ్గించేందుకు, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికీ చౌహాన్ అవిశ్రాంత కృషి చేశారన్నారు. గత ఎన్నికలలో ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చారని చెప్పారు. మధ్య ప్రదేశ్ పైన కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. గత పదేళ్లుగా కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో ఆకలితో ఉందని, వారు గెలిస్తే ఏం చేస్తారో అందరికీ తెలుసునన్నారు. ఎన్డీయే హయాంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని తప్పు పట్టలేదని, యూపిఏ పాలనలో మాత్రం అలా లేదన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బిజెపి గాలి వీస్తోందని, ఆలోచించి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
సిబిఐ, కాంగ్రెసుల పైన
సిబిఐని కాంగ్రెసు పార్టీ దుర్వినియోగం చేస్తోందని నిప్పులు చెరిగారు. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఢిల్లీ, చత్తీస్గఢ్ రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేది కాంగ్రెసు కాదని సిబిఐ అని ఎద్దేవా చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ కాంగ్రెసు పార్టీని రద్దు చేయాలని సూచించారని కానీ ఆ పార్టీ నాయకులు ఆయన మాటను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెసును రద్దు చేయాలన్న గాంధీజీ కలలను తాము నెరవేర్చుతామని మోడీ చెప్పారు.