హాలీవుడ్ హీరోల్లా బిల్డప్.. సోషల్ మీడియా ద్వారా సంపన్నయువతులకు ఎర.. బీ కేర్ ఫుల్
సోషల్ మీడియాను చీటింగ్ ప్లాట్ ఫామ్ గా వాడుతున్న వారు లేకపోలేదు. మోసపోయిన వాళ్ళు ఉన్నంత కాలం, మోసం చేసే వాళ్ళు కచ్చితంగా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా బాగా డబ్బు ఉన్న సంపన్న యువతులను ట్రాప్ చేసి,వారికి మాయమాటలు చెప్పి వారి వద్ద నుండి చాకచక్యంగా డబ్బులు గుంజుతున్నారు కేటుగాళ్లు .బాగా చదువుకున్న వాళ్లు సైతం ఇలాంటి చీటర్స్ చెబుతున్న హైక్లాస్ ముచ్చట్లు నమ్మి నిలువునా మునుగుతున్నారు.
కంటైనర్ లో రెండున్నర కోట్లకు పైగా విలువ చేసే 1050 కేజీల గంజాయి తరలింపు .. హైదరాబాద్ లో పట్టివేత
సోషల్ మీడియా ద్వారా పెరుగుతున్న మోసాలు .. యువతులే టార్గెట్
తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం సోషల్ మీడియా ద్వారా ఏం జరుగుతుంది? అమ్మాయిలు ఎట్లా మోసపోతున్నారు? అన్న విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. అమ్మాయిలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్న కేరళ రాష్ట్రంలోని ఉత్తర హళ్లి కి చెందిన సుహాన్ హరిప్రసాద్ తాను ఒక హాలీవుడ్ హీరోలా బిల్డప్ ఇస్తూ సోషల్ మీడియాలో అమ్మాయిలతో స్నేహం చేస్తుంటాడు. విదేశాల్లో ఉన్నట్టు విలాసవంతమైన కార్ల ముందు, భవనాల ముందు ఫోటోలు దిగి ఆ ఫోటోలను షేర్ చేసి అదంతా తన లైఫ్ స్టైల్ గా అమ్మాయిలు ముందు చిత్రీకరించే వాడు.
అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బు గుంజే కేటుగాడు .. నిత్యకృత్యం ఇదే
బాగా డబ్బున్న అమ్మాయిలని సెలెక్ట్ చేసుకొని వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి మాయమాటలు చెప్పి నిదానంగా డబ్బులు గుంజే పని మొదలు పెట్టాడు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని యువతులను ట్రాప్ చేసి చాలా తెలివిగా వారి నుండి డబ్బు తీసుకునేవాడు. అలా సంపాదించిన డబ్బుతో జల్సాలు చేయడం అతనికి అలవాటుగా మారింది. ఎప్పుడైతే అమ్మాయిలు డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తూ, కాస్త విముఖత వ్యక్తం చేస్తారో అప్పుడు వేరొక అమ్మాయికి గాలం వేసే పనిలో పడేవాడు సదరు కేటుగాడు.
12 లక్షల రూపాయలు మోసపోయానని పోలీస్ స్టేషన్ లో ఓ యువతి ఫిర్యాదు
తాజాగా ఒక అమ్మాయి ఈ మోసగాడి చేతిలో 12 లక్షల రూపాయలు మోసపోయానని పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ యువకుడిపై చీటింగ్ కు సంబంధించి మరో మూడు కేసులు ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు.
ఇతను ఒక్కడు మాత్రమే కాకుండా, ఇలాంటి కేటుగాళ్లు సోషల్ మీడియాను చీటింగ్ ప్లాట్ ఫామ్ గా మార్చుకుని అమాయకులైన యువతులను మోసం చేసే పనిలో పడ్డారు.
ప్రేమ పేరుతో ట్రాప్ .. సీక్రెట్స్ తెలుసుకుని బ్లాక్ మెయిల్స్
కొందరైతే అమ్మాయిలతో చొరవగా మెలుగుతూ, వారితో ప్రేమాయణం వెలగబెడుతూ ,యువతులను నిదానంగా ట్రాప్ చేసి, వారికి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని వాటి ఆధారంగా బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు గుంజే పనిలో పడ్డారు .దీంతో చాలామంది మహిళలు వారి వేధింపులు భరించలేక,బయటకు చెప్పుకోలేక సదరు కేటుగాళ్లకు అడిగినంత ముట్ట చెబుతున్నారు. వేధింపులు తీవ్రమైన తర్వాత తట్టుకోలేని పరిస్థితుల్లో మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
సోషల్ మీడియాలో యువతులకు అప్రమత్తత అవసరం
అందుకే సోషల్ మీడియాను వినియోగిస్తున్న అమ్మాయిలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు పోలీసులు. సోషల్ మీడియా ద్వారా చేసే స్నేహాలకు ఒక పరిధి ఉంటుందని, ఆ పరిధి దాటి గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్లవద్దని చెబుతున్నారు. ముఖ్యంగా ఎవరు పడితే వారిని నమ్మి ఫోటోలు షేర్ చేయడం, డబ్బులు పంపించడం చెయ్యొద్దని పదేపదే హెచ్చరిస్తున్నారు. బాగా చదువుకున్నవాళ్ళు కూడా ఇలాంటి చీటర్స్ చేతిలో మోసపోవడం తరచుగా జరుగుతుందని, అందుకే సోషల్ మీడియా వినియోగంలో బికేర్ ఫుల్ అని పదేపదే హెచ్చరిస్తున్నారు పోలీసులు.