weather: మరో మూడ్రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్లో కుండపోత
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజుల్లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Recommended Video
తెలంగాణలో మరో మూడ్రోజులపాటు వర్షాలు
మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో జులై 21న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఆదివారం, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అధికారులు వెల్లడించారు. గంటకు 30- నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షాలు
హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా ప్రతిరోజూ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆదివారం కూడా భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షం వరద నీరు చేరింది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అబిడ్స్, హిమాయత్నగర్, సికింద్రాబాద్, బేగంపేట, నాంపల్లి, ఎంజే మార్కెట్, పాతబస్తీ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం కూడా వర్షం కురుస్తూనే ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏపీలోనూ భారీ వర్షాలు మరో మూడు రోజులు
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో జులై 21న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉత్తర మధ్య మహారాష్ట్ర పరిసరాల్లో ఆవర్తనం బలహీనపడింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.