Weather update: తెలంగాణలో మూడ్రోజులపాటు వర్షాలు, 13 నుంచి ఏపీలో విస్తారంగా వానలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం కింది స్థాయి గాలులు పశ్చిమ, నైరుతి దిశల నుంచి రాష్ట్రం లోనికి వీస్తున్నాయని వెల్లడించింది.
Recommended Video
ఈ నేపథ్యంలో రాగల 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇప్పటికే కురిసిన వర్షాలు చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. వాగులు, నదుల్లో వరద నీరు భారీగా చేరుకుంది.

అల్పపీడనంతో ఏపీలోనూ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఆగస్టు 12వ తేదీన కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఆగస్టు 13 నుంచి రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది.
అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, ఉత్తర ఈశాన్య తెలంగాణ, ఉభయగోదావరి జిల్లాల మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడటంతో సోమవారం ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
మరోవైపు మధ్య భారతదేశంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రాంతం కారణంగా రాష్ట్రంలో పొడిగాలులు ప్రభావం ఎక్కువగా ఉందని.. అది బలహీనపడే వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
కాగా, గడిచిన 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. నూజివీడులో అత్యధికంగా 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా కంచికచర్లలో 30.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications