ఎన్నికల హింస: ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తత.. ఒక అభ్యర్థి హత్య.. మరికొందరికి బెదిరింపులు
కోహిమా/ షిల్లాంగ్: ఒకనాడు ఈశాన్య భారత రాష్ట్రాలు వేర్పాటువాద ఉద్యమాలకు, హింసాత్మక ఆందోళనకు నిలయం. కానీ 1990వ దశకం మధ్య నుంచి ఒకింత పరిస్థితుల్లో మార్పు కాన వస్తోంది. కానీ ఈశాన్య భారత రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో రాజకీయ హింస పెచ్చరిల్లడం ఆయా రాష్ట్ర ప్రజల్లో, రాజకీయ పార్టీల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు బెదిరింపులు, హెచ్చరికలు జారీ అవుతున్నాయని వార్తలొస్తున్నాయి.
ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మేఘాలయలోని ఈస్ట్ గ్యారో హిల్స్ జిల్లా పరిధిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అభ్యర్థి జొన్నాథన్ ఎన్ సంగ్మా బాంబు పేలుడులో హత్యకు గురయ్యారు. మరోవైపు గతవారం నాగాలాండ్ రాష్ట్రంలోనూ ఇద్దరు అభ్యర్థులపై హత్యాయత్నం జరిగింది. ఈ క్రమంలో పొరుగు రాష్ట్రాల నుంచి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో భద్రతా బలగాలను మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు తరలిస్తున్నారు

ఆదివారం ఇలా జొన్నాథన్ సంగ్మా హత్య
మేఘాలయలో ఎన్సీపీ అభ్యర్థి జొన్నాథన్ ఎన్ సంగ్మా ఆదివారం తన ఎన్నికల ప్రచారం ముగించుకుని నియోజకవర్గ కేంద్రం విలియమ్ నగర్ వెళుతుండగా ఆయన కాన్వాయ్పై బాంబు దాడి జరిగింది. ఆయనతోపాటు ముగ్గురు ఘటనాస్థలంలోనే మరణించారు. ఎన్నికల సంబంధిత ఘర్షణలు, దాడులు, హెచ్చరికలు ఈశాన్య రాష్ట్రాల్లో నిత్యక్రుత్యంగా మారాయి. ఎంతోకాలంగా ఈశాన్య భారత రాష్ట్రాలు వేర్పాటువాదంతో అట్టుడికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ఆగంతకులు, కొన్ని వేర్పాటువాద సంస్థలు తమ ఉనికిని కాపాడుకునేందుకు హెచ్చరికలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. జొన్నాథన్ ఎన్ సంగ్మా హత్యకు ముందు పలు సార్లు ఆయనకు బెదిరింపులు వచ్చాయని ఈస్ట్ గారో హిల్స్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కూడా పేర్కొనడం గమనార్హం.

మిలిటెంట్ల సాయంతో గట్టెక్కిన కాంగ్రెస్ అభ్యర్థి డెబొరా మరాక్
2013 అసెంబ్లీ ఎన్నికల్లో జొన్నాథన్ ఎన్ సంగ్మా.. కాంగ్రెస్ అభ్యర్థి డెబోరా మరాక్ కు వ్యతిరేకంగా పోటీ చేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మారక్ జీఎన్ఎల్ఏ మిలిటెంట్ల సాయంతో ఓటర్లను బెదిరించి మరీ విజయం సాధించారు. ఈ విషయమై డెబొరా మరాక్ పై ఐపీసీలోని 102 (బీ) 171 (ఎఫ్), 506 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కోర్టులో హాజరైన తర్వాత అప్పట్లో బెయిల్ మంజూరైంది. కానీ తాజాగా జొన్నాథన్ ఎన్ సంగ్మాపై ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని ఎన్సీపీ మేఘాలయ శాఖ అధ్యక్షుడు సాలెంగ్ సంగ్మా ఆరోపించడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది.

ముందస్తు ప్రణాళిక ప్రకారమే జొన్నాథన్ హత్య జరిగిందని ఎన్సీపీ ఆరోపణ
విలియం నగర్ పరిధిలోని ఆదివారం ప్రచారానికి రావాల్సిందిగా జొన్నాథన్ ఎన్ సంగ్మాను ఇద్దరు వ్యక్తులు ఆహ్వానించారని ఎన్సీపీ మేఘాలయ శాఖ అధ్యక్షుడు సాలెంగ్ సంగ్మా ఆరోపించారు. కానీ ఆయన పర్యటన షెడ్యూల్లో ఈ గ్రామాలు లేనే లేవన్నారు. కానీ మర్యాద కోసం వెళితే ఆయా గ్రామాల్లో ఎటువంటి సభ నిర్వహణా ఏర్పాట్లు లేవని గుర్తు చేశారు. జొన్నాథన్ ఎన్ సంగ్మా హత్యకు కొన్ని రోజుల ముందు ఆయనకు ఓటేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని విలియం నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ అంతటా పోస్టర్లు వెలిశాయి. దామాగ్రే, చిసోబిబ్రా, చిమాగ్రే, సమందా, దోల్వారిగ్రే గ్రామాల్లో జొన్నాథన్ సంగ్మాకు వ్యతిరేకంగా వేసిన పోస్టర్లపై ఈ నెల 16న ఎన్సీపీ ఫిర్యాదు చేసింది కూడా.

జొన్నాథన్ హత్యపై ప్రకటన చేయని మిలిటెంట్లు
అదే సమయంలో ఆయా సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించి సమస్యలు కొని తెచ్చుకోవద్దని కూడా పోస్టర్లు వెలిశాయి. ప్రచారం ముగించుకుని వెనుదిరిగిన గంటలోపే ఆయన హత్య జరిగిందని సాలెంగ్ సంగ్మా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జొన్నాథన్ ఎన్ సంగ్మా హత్యకు తమదే బాధ్యత అని ఏ మిలిటెంట్ గ్రూప్ కూడా ప్రకటించలేదు. కానీ నేషనలిస్టు పీపుల్స్ పార్టీ చీఫ్ కన్రడ్ సంగ్మా.. జొన్నాథన్ మరణానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తనకు అత్యంత ప్రియమైన స్నేహితుడు మిలిటెంట్ దాడిలో మరణించాడని ఆందోళన వ్యక్తం చేశారు. జొన్నాథన్ ఎన్ సంగ్మా హత్య వెనుక నిషేధిత గ్యారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ (జీఎన్ఎల్ఏ) హస్తం ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు.

బీజేపీ అభ్యర్థికి ప్రచారానికి వెళ్లొద్దని బెదిరింపులు
ఇటు నాగాలాండ్ రాష్ట్రం మొకోక్సుంచ్ పట్టణంలో కొరిడాంగ్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న నేషనలిస్టు పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అభ్యర్థి టీ చాలుకుంబా ఆవోపై గత వారం ఆగంతకులు దాడి చేశారు. ఒక షాపులోకి వెళుతున్న చాలూకుంబాపై ఆగంతకుల దాడిని ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతోపాటు గాలిలోకి కాల్పులు జరిపారు. వోఖా జిల్లా భండారి స్థానం నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి మోంన్లుమోకినోన్.. ఎన్నికల ప్రచారం నుంచి వెనుకకు తగ్గకుంటే తన ప్రాణానికి హాని ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు హత్యాయత్నం జరిగిందన్నారు. కానీ బీజేపీ మాత్రం తమ ప్రత్యర్థులే రాజకీయ దురుద్దేశంతో ఈ పని చేశారని ఆరోపించారు. ఎన్నికల వేళ ఇటువంటి ఘటనలు దురద్రుష్టకరమని నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చి కౌన్సిల్ (ఎన్బీసీసీ) ప్రధాన కార్యదర్శి కేయ్యో ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల ప్రచారం కంటే ప్రాణాలాు చాలా ముఖ్యమని కెయ్హో పేర్కొన్నారు. నాగాలాండ్ ప్రజలు ఇటువంటి హింసాత్మక ఘటనలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications