Republic-CNX exit polls: బెంగాల్లో బీజేపీ హవా: మమతా ఇంటికేనా?: అరకొరగా
న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటం ఆరంభమైంది. పశ్చిమ బెంగాల్లో చివరిదశ పోలింగ్ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియా హౌస్లు, ఎన్నికల సర్వేల ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అందరి కళ్లూ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్పై నిలిచాయి.
అధికార తృణమూల్ కాంగ్రెస్-భారతీయ జనతా పార్టీ మధ్య టగ్ ఆఫ్ వార్గా నడిచిన ఈ ఎన్నికల్లో ఎవరు పాగా వేస్తారనేది తేలుతోంది. రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం.. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ను బీజేపీ అందుకుంటుందని రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ పేర్కొంది. 292 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 147 స్థానాలు అవసరం అవుతాయి.
ఈ మేజిక్ ఫిగర్ను బీజేపీ అరకొరగానే అందుకుంటుందని తెలిపింది. బీజేపీకి 138 నుంచి 148 స్థానాలు వస్తాయని రిపబ్లిక్ టీవీ అంచనా వేసింది. తృణమూల్ కాంగ్రెస్కు 128 నుంచి 138 స్థానాలు రావొచ్చని పేర్కొంది. వామపక్ష పార్టీలు 11 నుంచి 21 స్థానాల వరకే పరిమితమౌతాయని అభిప్రాయపడింది. దీన్ని బట్టి అంచనా వేస్తే.. తృణమూల్ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా ఎదుగుతుందని, బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందనేది స్పష్టమౌతోంది.
ఈ రెండు పార్టీల మధ్య ఉన్న తేడా 10 నుంచి 20 సీట్ల వరకే ఉండటం వల్ల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యే అవకాశాలు కూడా లేకపోలేదనే అభిప్రాయాన్ని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. అసలు ఫలితాలు మే 2వ తేదీన అంటే ఆదివారం నాడు వెలువడనున్నాయి. చివరి విడత పోలింగ్లో పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సెంటేజీ నమోదైందని, అది తమ పార్టీకి లాభిస్తుందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.