బీజేపీ మరో షాక్: మమతా బెనర్జీ టీఎంసీలో చేరిన బిష్నుపూర్ ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్
కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ముందు టీఎంసీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలు.. ఇప్పుడు మళ్లీ బీజేపీ నుంచి టీఎంసీ బాటపడుతున్నారు. ఇప్పటికే ముకుల్ రాయ్ తోపాటు సీనీయిర్ నేతలు టీఎంసీలోకి తిరిగి వెళ్లిన విషయం తెలిసిందే.
తాజాగా, బిష్నుపూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్ కూడా టీఎంసీకి పార్టీలో చేరారు. టీఎంసీ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ నేత బ్రత్య బసు సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్తం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఘోష్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

అంతేగాక, పశ్చిమబెంగాల్ సంస్కృతిని బీజేపీ నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకు వ్యతిరేకంగానే తాను టీఎంసీలో చేరినట్లు తన్మయ్ ఘోష్ తెలిపారు. ఇటీవల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే ముకుల్ రాయ్ కూడా టీఎంసీలో చేరిన విషయం తెలిసిందే.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకపోవడంతో పలువురు నేతలు అధికార టీఎంసీ వైపు చూస్తున్నారు. వరుసగా బీజేపీ నుంచి గెలిచిన నేతలు టీఎంసీలో చేరుతుండటంతో ప్రతిపక్ష పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 213 స్థానాలు గెలుపొందగా.. బీజేపీ 77 స్థానాల్లో విజయం సాధించింది.
కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ, టీఎంసీ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల మమతా బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయంగా తమతో పోరాటం చేయలేకపోతోందని, అందుకే దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని కేంద్రం, బీజేపీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. బొగ్గు అక్రమ రవాణా కేసులో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం సమన్తు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ కేంద్రంపై ఫైరయ్యారు.
తన మేనల్లుడి(అభిషేక్ బెనర్జీ)కి ఈడీ సమన్లు జారీ చేయడంపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ తమకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను తిప్పికొట్టడం తమకు తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. తమతో రాజకీయంగా పోరాడాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు.
తమపై ఈడీనీ ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించారు. తమకు ఎలా తిప్పటికొట్టాలో తెలుసని అన్నారు. ఈ అవినీతి విషయంలో టీఎంసీ వైపు వేలెత్తి చూపడం వల్ల ప్రయోజనం లేదన్నారు. సహజ వనరుల కేటాయింపులు కేంద్రం పరిధిలోని అంశమన్నారు. తమ రాష్ట్రంలో బొగ్గు గనుల్ని దోచుకుంటున్న బీజేపీ నాయకుల సంగతేంటని మమత ప్రశ్నించారు.
అంతేగాక, ఇటీవల కేంద్రం ప్రకటించిన జాతీయ మానిటైజేషన్ పైప్లైన్ ప్రణాళికను తప్పుబట్టారు మమతా బెనర్జీ. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అమ్మేయాలని చూస్తోందని ఆరోపించారు. రైల్వే, విమానాశ్రయాలు, పీఎస్యూలు.. ఇలా అన్నింటినీ అమ్మేయాలనుకుంటోందని మండిపడ్డారు. దేశంలోని మట్టిని కూడా అమ్మగలరా? అని ప్రశ్నించారు మమతా బెనర్జీ.
కాగా, సెప్టెంబర్ ఒకటిన రుజిరా ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా.. అదే నెల 6న ఈడీ అభిషేక్ బెనర్జీని ప్రశ్నించనుంది. దీనిపై అభిషేక్ కూడా తీవ్రంగా స్పందించారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో తమను బెదిరించవచ్చని వారు(బీజేపీ) అపోహపడుతున్నారని అన్నారు. ఇలాంటి వాటికి బెదరమని వారికి చెప్పాలనుకుంటున్నా.. చేతనైతే త్రిపురలో టీఎంసీనీ అడ్డుకోండి.. అంటూ బీజేపీ, అమిత్ షాకు అభిషేక్ సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications