మమతా బెనర్జీ..ఇక ఎమ్మెల్సీ: కొత్తగా శాసన మండలి ఏర్పాటు ప్రక్రియ షురూ: ఆరునెలల్లోగా
కోల్కత: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారబోతోన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. ఇక శాసన మండలి సభ్యురాలు కాబోతోన్నారు. దీనికి అవసరమైన ప్రక్రియను ఆరంభించారు. శాసన మండలి ద్వారా చట్టసభల్లో అడుగు పెట్టడానికి బాటలు వేసుకున్నారామె. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కొత్త ముఖాలను బరిలో దింపినందున.. టికెట్ లభించని పార్టీ సీనియర్ నేతలకూ ఎమ్మెల్సీ అవకాశాన్ని కల్పించనున్నారు. ఆరు నెలల్లోగా మమతా బెనర్జీ చట్టసభలో అడుగు పెట్టాల్సి ఉన్నందున.. ఈ ప్రక్రియ మరింత వేగవంతం కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆలయ ప్రాంగాణల్లో కోవిడ్ సెంటర్లు..వారికి మాత్రమే: కన్నాకు మంత్రి వెల్లంపల్లి ఘాటు రిప్లై
1969లో మండలి రద్దు..
పశ్చిమ బెంగాల్లో కొత్తగా శాసన మండలిని ఏర్పాటు చేయడానికి ఆ రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ముసాయిదా తీర్మానాలను ఆమోదించింది. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో శాసన మండలి వ్యవస్థ లేదు. నిజానికి- పశ్చిమ బెంగాల్లో శాసన మండలి వ్యవస్థ 1952లో ఆరంభమైంది. ఒకటిన్నర దశాబ్దం పాటు కొనసాగింది. 1969లో దీన్ని రద్దు చేసింది అప్పటి ప్రభుత్వం. తాజాగా మళ్లీ తెరమీదికి రాబోతోంది.
ఎన్నికల హామీ మేరకు..
తాము అధికారంలోకి వస్తే.. శాసన మండలిని ఏర్పాటు చేస్తామంటూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. దీన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం చేర్చారు. ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండువారాల్లోనే మండలి ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియను చేపట్టారు. తాను స్వయంగా చట్టసభలో అడుగు పెట్టడంతో పాటు టికెట్ దక్కని సీనియర్లు, అసంతృప్త నాయకులను బుజ్జగించడానికి ఇది ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
సభ ఆమోదం ఖాయమే..
తదుపరి శాసన సభ సమావేశాల్లో దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టనుంది అధికార పార్టీ. సభలో పూర్తి మెజారిటీ ఉన్నందున.. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించినప్పటికీ- ఈ బిల్లు చట్ట రూపం దాల్చడం ఖాయమే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి వ్యవస్థ కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, ఉత్తర ప్రదేశ్లల్లో రాష్ట్రస్థాయి పెద్దల సభ మనుగడలో ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్.. మండలిని రద్దు చేయాలంటూ తీర్మానించింది. అదింకా కార్యరూపం దాల్చలేదు.
మమతకు అత్యవసరం..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ.. తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన సువేందు అధికారి చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ-ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరునెలల్లోగా చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉన్నందున.. మండలిని తెరమీదికి తీసుకొచ్చారు. దీనికి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంత మేర సహకరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.