పార్కుకు తీసుకెళ్లి 9వ విద్యార్థినిపై గ్యాంగ్రేప్: 4గురు మైనర్లు అరెస్ట్
జల్పాయిగురి: తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై నలుగురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయ్ గురి జిల్లాలోని కరాల నది వద్ద చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో దారుణానికి పాల్పడిన నలుగురిని బాధితురాలు గుర్తించింది. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం నలుగురు మైనర్లు ఆ బాలికను బలవంతంగా మూతబడిన పిల్లల పార్కులోకి తీసుకెళ్లి అనంతరం మత్తుపదార్థాలు కలిపిన ఆహార పదార్థాలను ఇచ్చారు. బాలిక మత్తులోకి జారుకుంటుండగానే సామూహికంగా అత్యాచారానికి పాల్పడి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
కాగా, కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులు ఇంటికి రాని తమ కూతురు కోసం తీవ్రంగా గాలించారు. చివరకు సోమవారం కరాల నది వద్ద ఉన్న పాడుబడ్డ పార్కులో అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
అనంతరం స్పృహలోకి వచ్చిన ఆ బాలిక, జరిగిన ఘటన గురించి తల్లిదండ్రులకు, పోలీసులకు వివరించింది. బాధితురాలు గుర్తించిన నలుగురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వివరాలతో సహా కోర్టు ముందు హాజరుపర్చారు.
నిందితులందరూ మైనర్లు కావడంతో వారిని జువెనైల్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆస్పత్రికి తరలించినట్లు, మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ రబీంద్రనాథన్ చెప్పారు.