ఆసుపత్రిలో కదల్లేని స్థితిలో మమతా బెనర్జీ: కంటిపైనా గాయం: గవర్నర్ పరమార్శ.. చేదు అనుభవం
కోల్కత: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముంగింట్లో. ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కదల్లేని స్థితికి చేరుకున్నారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అడుగు తీసి కింద పెట్టలేని స్థితిలో ఉన్నారామె. నందిగ్రామ్లో చోటు చేసుకున్న తోపులాట సందర్భంగా మమతా బెనర్జీ గాయపడ్డారు. ఆమె కాలికి ఫ్రాక్చర్ అయింది. ఫలితంగా- తన నందిగ్రామ్ పర్యటనను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. మమతా గాయపడటాన్ని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా అభివర్ణిస్తోంది.

ఆసుపత్రిలో అడ్మిట్..
నందిగ్రామ్లో టీఎంసీ అభ్యర్థినిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన మమతా బెనర్జీ సాయంత్రం ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం కారు ఎక్కుతున్న సమయంలో తోపులాట చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో పార్టీ నాయకులు తోసుకుని రావడంతో ఆమె అదుపు తప్పి, కిందపడ్దారు. కాలికి గాయమైంది. ఆమె నొప్పితో విలవిలల్లాడారు. నందిగ్రామ్ పర్యటనను అర్ధాతరంగా ముగించుకుని కోల్కతకు బయలుదేరారు. కోల్కత ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చేరారు. ఆమె కాలికి డాక్టర్లు సిమెంట్ కట్టు కట్టారు. ప్రస్తుతం ఆమె కదల్లేని స్థిలో ఉన్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే వందలాది మంది తృణమూల్ కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకున్నారు.

గవర్నర్ పరామర్శ..
మమతా బెనర్జీ ఆసుపత్రిలో చేరిన తరువాత గవర్నర్ జగ్దీప్ ఢంకర్ ఆమెను పరామర్శించారు. మమత ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. సంఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మమత ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని మెడికల్ డైరెక్టర్కు సూచించారు. ఈ సందర్భంగా గవర్నర్కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్ ఆసుపత్రి వద్దకు చేరుకున్న వెంటనే తృణమూల్ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కాన్వాయ్ వైపు దూసుకుని వచ్చారు. గవర్నర్ గో బ్యాంక్ అంటూ నినదాలు చేశారు. ఈ పరిణామాలతో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దాడి జరిగిందంటూ
తమ పార్టీ అధినేత్రిపై దాడి జరిగిందంటూ తృణమూల్ లోక్సభ సభ్యుడు అభిజిత్ బెనర్జీ ఆరోపించారు. ఆసుపత్రిలో కట్టుకున్న స్థితిలో ఉన్న మమతా బెనర్జీ ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారంటూ విమర్శించారు. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నందిగ్రామ్లో మమత బెనర్జీకి లభించిన ప్రజాదరణను చూసి, ఓర్చుకోలేక.. భౌతికదాడులకు దిగుతున్నారంటూ అభిజిత్ మండిపడ్డారు. ఈ దాడి ప్రభావం ఎలాంటిదో.. మే 2వ తేదీ నాడు ఓట్ల లెక్కింపు సందర్భంగా స్పష్టమౌతుందని ఆయన అన్నారు.

సువేందు వర్గీయులపైనే చూపుడు వేళ్లు..
సువేందు అధికారిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వనంటూ ప్రతిజ్ఞ చేసిన మమతా బెనర్జీ.. దాన్ని చేతల్లో చూపించారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయడానికి నందిగ్రామ్ను ఎంచుకున్నారు. తన పాత నియోజకవర్గం భవానీపురాను వదిలి పెట్టారు. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉంటూ వచ్చిన నందిగ్రామ్ను తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2009 ఉప ఎన్నిక తరువాత.. ఆ స్థానాన్ని తృణమూల్ ఎప్పుడూ ఓడిపోలేదు. అలాంటి నందిగ్రామ్ బరిలో తృణమూల్ మాజీ నాయకుడు సువేందు.. బీజేపీ తరఫున పోటీ చేయనుండటం, ఆయనపై ఏకంగా మమతా బెనర్జీ నిల్చోవటం వంటి పరిణామాల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. సువేందు అధికారి వర్గీయులే దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.












Click it and Unblock the Notifications