దీదీ ఫాలోస్ జగన్: బెంగాల్లోనూ ఏపీ తరహాలోనే: కీలక నిర్ణయాలు: అది కూడా..!!
కోల్కత: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతోన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడుల అనంతరం దేశ రాజకీయాలకు కేంద్ర బిందువు అయ్యాయి. ప్రభుత్వం నుంచి ఉద్వాసనకు గురైన మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సమీప బంధువు అర్పిత ఛటర్జీ అరెస్ట్ అనంతరం అక్కడ పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. విమర్శల సుడిగుండంలో చిక్కుకుందక్కడి ప్రభుత్వం. దీని నుంచి బయటపడటానికి మార్గాలను అన్వేషిస్తోంది.
ఏపీలో జీఎస్టీ వసూళ్ల దూకుడు: మరోసారి ఆ రికార్డ్: రాష్ట్రాలవారీగా బ్రేకప్ ఇదే
ఏపీ తరహాలో..
ఈ పరిస్థితుల మద్య తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఇవ్వాళ కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తోన్నట్లు ప్రకటించారు. అలాగే- మంత్రివర్గ ప్రక్షాళనకూ శ్రీకారం చుట్టారు. తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించబోతోన్నారు. కొత్త ముఖాలకు చోటు కల్పించనున్నారు. తాజాగా మమత బెనర్జీ ప్రకటించిన ఈ కీలక నిర్ణయాలన్నీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదివరకు అమలు చేసినవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రజల డిమాండ్లకు అనుగుణంగా..
కొద్దిసేపటి కిందటే మమత బెనర్జీ కోల్కతలో మాట్లాడారు. ప్రజల డిమాండ్లకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతోన్నట్లు చెప్పారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో 23 జిల్లాలు ఉండగా.. ఈ సంఖ్యను 30కి పెంచనున్నామని అన్నారు. పాలన సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల వల్ల పరిపాలన ప్రజలకు మరింత చేరువ అవుతుందని, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ప్రాజెక్టులు పరుగులు తీస్తాయని చెప్పారు.
కొత్త జిల్లాలివే..
సుందర్బన్, ఇచ్ఛెమతి, రణఘట్, బిష్ణుపూర్, జంగీర్పూర్, బెహ్రమ్పూర్, బసీర్హాట్.. కేంద్రాలుగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. దీనికి అవసరమైన చర్యలన్నింటినీ ఇది వరకే పూర్తి చేశామని చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుందని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి గడువు ఇచ్చామని అన్నారు.
కొత్త మంత్రులు..
దీనితో పాటు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్లు మమత బెనర్జీ స్పష్టం చేశారు. కొత్తగా 4 నుంచి 5 మంది వరకు కొత్త ముఖాలకు చోటు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మీడియాలో వచ్చినట్లుగా తాను మొత్తం మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయదలచుకోవట్లేదని తేల్చి చెప్పారు. కొత్తవారిని మాత్రం తీసుకుంటున్నానని అన్నారు. మూడు శాఖలు ఖాళీగా ఉన్నాయని, వాటిని ప్రస్తుతం తానే నిర్వహిస్తోన్నానని వ్యాఖ్యానించారు.
ఖాళీల వల్ల..
పంచాయతీ రాజ్ సహా ఒకట్రెండు కీలక శాఖలను పర్యవేక్షించిన సుబ్రత ముఖర్జీ గత ఏడాదిలో, వినియోగదారుల వ్యవహారాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ శాఖ మంత్రి సధన్ పాండే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కన్నుమూశారు. ఆయా శాఖలను మమత బెనర్జీ ఎవరికీ కేటాయించలేదు. తాజాగా పార్థ ఛటర్జీ అరెస్ట్ అయ్యారు. ఆయన పర్యవేక్షణలో ఉన్న శాఖ కూడా ఆమె ఆధీనంలో ఉంది. అవన్నీ కీలకమైన శాఖలు కావడం వల్ల తాను వాటిని సమర్థవంతంగా నిర్వహించలేకపోతోన్నానని వివరించారు.
ఎల్లుండే ముహూర్తం..
అందుకే- మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఎల్లుండి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనీ తెలిపారు. అదే రోజు సాయంత్రానికి పోర్ట్ఫోలియోలను ప్రకటిస్తానని మమత బెనర్జీ స్పష్టం చేశారు. పార్థ ఛటర్జీ అరెస్ట్ విషయంలో ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలను తాను పట్టించుకోట్లేదని తేల్చేశారు. సొంత పార్టీ నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని పార్థ ఛటర్జీని తప్పించినట్లు చెప్పారు.