బాంబులతో పేల్చేస్తామని బెదిరింపు: కోర్టు మూసివేత
కోల్కతా: పేల్చేస్తామని బెదిరింపు లేఖ రావడంతో కార్యకలాపాలన్నీ నిలిపేసి న్యాయస్థానం భవనాన్ని మూసేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయ్గురిలో చోటుచేసుకుంది.
జల్పాయ్గురి జిల్లా కోర్టుకి నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ బోడోల్యాండ్(ఎన్డీఎఫ్బీ) నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. కోర్టు భవనంలో మూడు బాంబులు అమర్చినట్లు, సమీపంలో మరో రెండు బాంబులు అమర్చినట్లు బెదిరింపు లేఖ వచ్చిందని బార్ అసోసియేషన్ సెక్రటరీ అవినందన్ చటర్జీ తెలిపారు.

పోలీసులకు సమాచారం అందించామన్నారు. పోలీసులు వెంటనే కోర్టును ఖాళీ చేయించి, పోలీసు జాగిలాలు, బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి బాంబులు అక్కడ లభించలేదు.
బెదిరింపు లేఖను, సంఘటను సీరియస్గా తీసుకొని విచారణ చేపడుతున్నామని, ఉగ్రవాదులతో లేఖకు సంబంధం ఉందా? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ ఆకాశ్ మేఘారియా పరిశీలించారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేపడతామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications