బెంగాల్లో 'ఘర్ వాపసీ' చిత్ర,విచిత్రాలు... సొంత గూటికి చేరేందుకు వింత పోకడలు...
బెంగాల్ రాజకీయంలో 'ఘర్ వాపసీ' కార్యక్రమం జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన టీఎంసీ నేతలు,కార్యకర్తలంతా తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోయేదేమీ లేకపోయినప్పటికీ... ఘర్ వాపసీ తంతు జరుగుతున్న తీరు మాత్రం ఆశ్చర్యపరుస్తోంది. గుండు గీయించుకుని కొందరు,తులసి చెట్టుపై ప్రమాణం చేసి కొందరు,గంగాజలం నెత్తిన చల్లుకుని కొందరు... ఇలా టీఎంసీలో చేరికల పరంపర కొనసాగుతోంది. బీజేపీలో చేరడం ద్వారా కలిగిన అపవిత్రతను,పాపాలను ఇలా శుద్ధి చేసుకుని పునీతులమవుతున్నామని ఆ నేతలు,కార్యకర్తలు చెబుతున్నారు.
మరికొందరు నేతలు టోటోస్(ఆటో రిక్షా లాంటి వాహనం)లో గ్రామాల్లో ఊరేగుతూ బీజేపీలో చేరినందుకు బహిరంగ క్షమాపణ ప్రకటిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం వీటితో తమకు సంబంధం లేదంటున్నారు. తిరిగి పార్టీలో చేరేందుకు అలాంటి నిబంధనలేవీ తాము పెట్టలేదని చెబుతున్నారు. కింది స్థాయి కార్యకర్తలంతా సంయమనం పాటించాలని కోరుతున్నామని... తమది ప్రతీకారం కోసం వెంపర్లాడే పార్టీ కాదని టీఎంసీ ఎంపీ సుఖెందు శేఖర్ రాయ్ తెలిపారు. టీఎంసీని వీడినవారికి కనువిప్పు కలిగి... తమకు తామే పార్టీలో వచ్చి చేరుతున్నారని చెప్పారు.

బెంగాల్లోని బీర్భమ్ జిల్లాలో ఘర్ వాపసీ కార్యక్రమం ఎక్కువగా సాగుతోందన్న ప్రచారం ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇక్కడ పెద్ద ఎత్తున టీఎంసీ కార్యకర్తలు బీజేపీలో చేరారు. తీరా అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి 11 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు టీఎంసీ గెలుచుకోవడంతో వారు షాక్ తిన్నారు. దీంతో తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. అలా దాదాపు ఒక్క బీర్భమ్ జిల్లాలోనే 25వేల మంది కార్యకర్తలు తిరిగి టీఎంసీలో చేరినట్లు జాతీయ మీడియా 'ది ప్రింట్' వెల్లడించింది.
ఇదే బీర్భమ్ జిల్లా నుంచి ఘర్ వాపసీ కార్యక్రమం కొత్త పుంతలు తొక్కిందని చెబుతున్నారు. గత జూన్ 8న కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఇక్కడ టోటో వాహనాల్లో ఊరేగింపు నిర్వహించి బహిరంగ క్షమాపణలు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అబద్దాలు ప్రచారం చేశామని... తాము చెప్పినవన్నీ అసత్యాలేనని బహిరంగంగా ప్రజలకు చెప్పారు. బీజేపీ తరుపున పనిచేసి పాపం మూటగట్టుకుంటున్నామని... దయచేసి తమను క్షమించాలని వేడుకున్నారు. అప్పటినుంచి ఇదే తంతు పలు జిల్లాలకు పాకింది.సామూహిక శిరోముండనాలు,తులసి చెట్లపై ప్రమాణాలు,గంగా జలం నెత్తిన చల్లుకోవడం వంటి కార్యక్రమాలతో ఘర్ వాపసీ కార్యక్రమం కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications